వైజాగ్ స్టీల్పై జగన్ బిగ్ స్కెచ్- లేఖ మోడీకి- ఇరికించింది విపక్షాన్ని-ట్రాప్లో పడతారా ?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజురోజుకీ తీవ్రతరం అవుతుండటం ఏపీలో వైసీపీ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని తేలిపోవడంతో ఇక మైలేజ్ గేమ్ మొదలైంది. ఇందులో భాగంగా విపక్ష టీడీపీ.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలకు డిమాండ్ చేస్తుండగా.. దీనికి కౌంటర్గా ప్రధానిని అపాయింట్మెంట్ కోరిన సీఎం జగన్.. ఇందులో టీడీపీతో పాటు ఇతర విపక్షాలను కూడా లాగారు. ఇప్పుడు వారి స్పందన ఎలా ఉన్నా జగన్కే మైలేజ్ అన్న చర్చ జరుగుతోంది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో వైసీపీకి చుక్కలు
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం నిర్ణయం తీసుకున్న కేంద్రం.. వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్రం క్లారిటీ ఇచ్చేసినా ఇంకా లేదు లేదు అంటూ బుకాయిస్తున్న నేతలకు షాకిచ్చేలా నిన్న ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వందశాతం ప్రైవేటీకరణ తప్పదని రాతపూర్వకంగానే చెప్పేశారు. దీంతో ఇప్పుడు బీజేపీతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. బీజేపీకి ఏపీలో పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కానీ వైసీపీ పరిస్ధితి అలా కాదు.. పార్లమెంటులో 27 మంది ఎంపీలు, ఏపీ అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు కలిగిన వైసీపీకి ప్రజల్లో ముఖం చాటేయాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది. దీంతో ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
విశాఖ స్టీల్పై జగన్ భారీ వ్యూహం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో ఇరుకునపడ్డ వైసీపీ ఇది అమలైతే మరింత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 27 మంది ఎంపీలు ఉండి కూడా కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోలేకపోయారన్న అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుంది. దీంతో వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ ఇప్పుడు వైజాగ్ స్టీల్పై వ్యతిరేకతను తగ్గించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రధానికి తాజాగా రాసిన లేఖనూ వాడేసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిసి కూడా అఖిలపక్షం, కార్మికసంఘాలతో కలిసి వస్తాను, అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధానికి జగన్ రాసిన లేఖ రాజకీయ అస్త్రంగానే ప్రచారం జరుగుతోంది. ఈ లేఖతో జగన్ తనతో పాటు విపక్షాలను కూడా భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ నోట తొలిసారి అఖిలపక్షం మాట
ప్రధాని అపాయింట్మెంట్ కోసం జగన్ రాసిన లేఖతో అఖిలపక్షంతో కలిసి వస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలకు మద్దతివ్వడం కానీ, వారితో కలిసి ఆందోళనలు చేపట్టడం కానీ, కనీసం వారితో రాష్ట్రస్ధాయిలో అఖిలపక్ష భేటీకి కూడా జగన్ సిద్ధం కాలేదు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు అఖిలపక్షంతో వస్తానంటూ నేరుగా ప్రధానికి లేఖ రాయడం సంచలన రేపుతోంది. అఖిలపక్షంతో సంప్రదింపులు కూడా జరపకుండా వారిని తీసుకుని వస్తానంటూ జగన్ ప్రధానిని కోరడంపైనా విపక్షాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అఖిలపక్షానికి విపక్షాలు సహకరిస్తాయా ?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చించేందుకు ప్రధాని ఒకవేళ సీఎం జగన్కు అనుమతి ఇస్తే అప్పుడు అఖిలపక్షాన్ని పేర్లు పంపాలని ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధానితో భేటీకి విపక్షాలు జగన్తో కలిసి ఒప్పుకుంటే సరి. లేకపోతే జగన్ ఒంటరిగా వెళ్లి ప్రధానిని కలవాల్సి ఉంటుంది. స్టీల్ ప్లాంట్ పోరులో తనపై వ్యతిరేకత తగ్గించుకునేందుకే ప్రధానితో అపాయింట్మెంట్ నాటకం ఆడుతున్నారని భావిస్తున్న విపక్ష టీడీపీ, ఇతర పార్టీలు ఇందులో భాగస్వాములు అయ్యే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం అధికారికంగా కోరితే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాయి.
ఏం జరిగినా రాజకీయంగా జగన్కే మేలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై చర్చించేందుకు ప్రధాని మోడీ.. సీఎం జగన్కు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా జగన్కు మైలేజ్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మోడీ అపాయింట్మెంట్ ఇస్తే తాము పోరాడామని, కానీ కేంద్రం ఒప్పుకోలేదని చెప్పుకోవడానికి వీలు దొరుకుతుంది. అలా కాకుండా మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో బీజేపీని కార్నర్ చేసి వైసీపీ బయటపడేందుకు కూడా అవకాశం దక్కుతుంది. మరోవైపు ఈ వ్యవహారంలో విపక్షాలు సహకరిస్తే జగన్కు మైలేజ్ దక్కుకుంది. లేకున్నా జగన్ ప్రధానితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినా విపక్షాలు కలిసి రాలేదని వైసీపీ విమర్శలు చేయడానికీ అవకాశం దక్కుతుంది. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరిగినా జగన్కు మైలేజ్ ఖాయమని తెలుస్తోంది.