తెలంగాణపై సుప్రీంకు ఏపీ సర్కార్-ఒప్పందాల ఉల్లంఘనపై పిటిషన్-ప్రజల హక్కులు హరిస్తోందంటూ
ఏపీ-తెలంగాణ మధ్య వాటర్ వార్ ముదురుతున్న నేపథ్యంలో తమ ప్రాంత ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ లిఫ్ట్ వివాదంతో మొదలైన జల జగడం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది.
Recommended Video
కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు చేపడుతోందని ఆరోపిస్తున్న వైసీపీ సర్కార్.. ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లోనూ వీటిని ప్రస్తావించింది. అంతే కాకుండా ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నీటి వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్లో ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వం రాజ్యంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోందని ఏపీ సర్కార్ తన పిటిషన్ లో సుప్రీంకోర్టుకు తెలిపింది.
కృష్ణా జలాల పంపిణీకి గతంలో జరిగిన ఒప్పందాలను తెలంగాణ సర్కార్ ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఏపీ సర్కార్ పేర్కొంది. కృష్ణానదిపై ఉన్న సాగర్, శ్రీశైశం, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న ఇచ్చిన జీవోను రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం కోరింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా రివర్ బోర్డును నోటిఫై చేయాలని, కానీ ఇప్పటివరకూ ఆ పని జరగలేదని, దీంతో తెలంగాణ ప్రభుత్వం యథేచ్చగా ఒప్పందాలు ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసింది.