విపక్షాల ట్రాప్ లో జగన్ ? రెండేళ్ల ముందే రంగంలోకి- చంద్రబాబు, పవన్ కోరుకున్నట్లే..!
ఏపీలో రాజకీయాలు వేసవిలో మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా జగన్ ను ఎప్పుడు గద్దె దించేద్దామా అని ఎదురుచూస్తున్న విపక్షాలకు ఆ అవకాశం త్వరగానే వచ్చేస్తోంది. ఇప్పటికే కేబినెట్ ప్రక్షాళన, ఇన్ ఛార్జ్ మంత్రుల ప్రకటన, వైసీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల ప్రకటనతో 2024 ఎన్నికలకు టీమ్ తయారు చేసేసుకున్న జగన్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దూకేశారు. దీంతో సాధ్యమైనంత జగన్ ను పోరులోకి లాగాలన్న విపక్షాల పంతం నెగ్గుతోంది.
జనంలోకి దూకేసిన జగన్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం త్వరలో మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏం సాధించిందో చెప్పేందుకు సీఎం జగన్ జనంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే జిల్లాల పర్యటన ప్రారంభించిన జగన్ రోజుకో జిల్లాలో పర్యటిస్తూ తమ ప్రభుత్వ సంక్షేమాన్ని గుర్తు చేయడం మొదలుపెట్టేశారు. జగన్ ఏం చేశాడో చూసి ఓటేయాలంటూ జనాన్ని కోరడం మొదలుపెట్టారు. దీంతో ఎప్పుడో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు జగన్ ఇప్పటినుంచే జనంలోకి ఎందుకు వెళ్తున్నారన్న అనుమానాలు మొదలయ్యాయి.
పథకాలు చూసి ఓటేయాలంటూ
ఏపీలో వైసీపీ సర్కార్ భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇందుకోసం భారీగా అప్పులు కూడా చేస్తోంది. ఇందులోనూ ఎలాంటి అనుమానం లేదు. అయితే అప్పులు చేసి మరీ సంక్షేమానికి పెడుతున్న ఖర్చుకు తగిన మైలేజ్ వస్తుందా అంటే అనుమానమే. నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ సంక్షేమ పథకాలపై జనంలో మైలేజ్ తీసుకురావాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో నేరుగా జగనే రంగంలోకి దూకేశారు. ఇప్పుడు అదే విషయాల్ని జగన్ జనానికి పదే పదే గుర్తు చేస్తున్నారు. సంక్షేమం అందితేనే ఓటేయాలని కోరుతున్నారు.
తొందరపాటా ? భయమా
ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉండగానే సీఎం జగన్ జనంలోకి వెళ్లి ఓట్లు అడగటం మొదలుపెట్టేయడం రాజకీయ పరిశీలకుల్ని, విశ్లేషకుల్ని సైతం ఆలోచనలో పడేస్తోంది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక, ప్రజలు ఐదేళ్లు పాలించాలని తీర్పు ఇచ్చాక మధ్యలో మూడేళ్లు కాగానే జనంలోకి వెళ్లి ఓట్లు అడగడం ద్వారా జగన్ ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. ప్రజా వ్యతిరేకత ప్రచారం నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు ఏమైనా వెళ్లదల్చుకున్నారా లేక ప్రజల్లో ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టకపోతే ఓడిపోతామని భయపడుతున్నారా అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎన్నికలకు రెండేళ్ల ముందే జనంలోకి వెళ్లడం వల్ల విలువైన పాలనా సమయం వృథా కావడం లేదా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అయినా జగన్ ఇప్పుడు అవేవీ లెక్కచేసే పరిస్ధితుల్లో లేరు.
విపక్షాల కోరికను జగన్ మన్నించారా ?
ఏపీలో 2019లో అధికారం కోల్పోయిన తర్వాత విపక్షాలు అవే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్ కు పలు సవాళ్లు విసరడం మొదలుపెట్టాయి. ఇందులో ముఖ్యమైనది రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా ప్రభుత్వం తిరిగి ప్రజాతీర్పు కోరాలనడం, అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్లు చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే తాము ఎన్నిసార్లు సవాళ్లు విసురుతున్నా జగన్ స్పందించడం లేదని తీవ్ర పదజాలం వాడి వార్తల్లో నిలిచేందుకు విపక్షాలు చేయని ప్రయత్నాలులేవు. ఎట్టకేలకు విపక్షాల కోరికను జగన్ మన్నించారా అన్నట్లుగా రెండేళ్ల ముందే ప్రజల్లోకి వెళ్లడం కనిపిస్తోంది. అంతే కాదు విపక్షాలు కోరుకున్నట్లుగానే ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్దమవుతున్నారా అన్న ప్రచారం కూడా సాగుతోంది. సంక్షేమం చూసే ఓటు వేయాలంటూ కోరడం వెనుక ఇంతకు మించిన ఉద్దేశం ఏముంటుందనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ తిరిగి జగనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.