కెసిఆర్దీ తప్పే, దొరా! బాబుని అడుగు, మీరే అడుగుతారా: విలేకరితో జగన్
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసినా తప్పే, ఏపీ సీఎం చంద్రబాబు చేసినా తప్పే, మరెవరు చేసినా తప్పేనని ఏపీ ప్రతిపక్ష నేత వైసిపి అధినేత జగన్ మంగళవారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులు సరికాదన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు.
నాపై కేసులు పెట్టిందే వారు
తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టాకే తాను కాంగ్రెస్ పార్టీకి చేదు అయ్యానని, టిడిపితో కలిసి తన పైన కేసులు పెట్టారన్నారు. తన పైన కేసులు పెట్టింది టిడిపి, కాంగ్రెస్ పార్టీలు అన్నారు. పిటిషనర్లు ఆ పార్టీల వాళ్లే అన్నారు. వైయస్ బతికున్నంత వరకు, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు మంచివాడినే అయ్యానని, కాంగ్రెస్ పార్టీని వీడాక కేసులు పెట్టారన్నారు.
తాను కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై కేసులు వేస్తే ఆయన కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని నేను చెబుతున్నానని, ఆయనకు దమ్ముంటే తన పైన విచారణ జరిపించుకోవాలని సవాల్ చేశారు.
చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు రెండు ఎకరాల భూమి అన్నారు. ఈ రోజు ఆయన ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని అన్నారు. చంద్రబాబు ఆస్తుల పైన సిబిఐ విచారణ చేయిస్తే అన్నీ బయటకు వస్తాయని జగన్ అన్నారు. పార్టీ ఫిరాయింపులతో చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారన్నారు.
మీరొక్కరే అడిగితే ఎలా.. అందర్నీ అడగనివ్వు
తాను ప్రకటించిన ఆస్తుల కంటే ఒక్క రూపాయి ఎక్కువగా ఉన్నా తాను వారికే రాసిస్తానని చంద్రబాబు అన్నారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా... జగన్ మాట్లాడుతూ.. సదరు విలేకరి పేరు అడిగారు. ఆయనను ఉద్దేశించి.. మీరొక్కరే అడిగితే ఎలా, అందర్నీ అడగనివ్వు అన్నారు.
చంద్రబాబు సీఎం అయిన ఈ రెండేళ్లలో రూ.లక్షా ముప్పై నాలుగు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్ ఆరోపించగా.. ఓ విలేకరి స్పందిస్తూ.. మీపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు కాబట్టి ఈ రోజున అంతకంటే ఎక్కువగా రూ.లక్షా ముప్పై నాలుగువేల కోట్ల అవినీతి ఆరోపణలు చంద్రబాబుపై చూపిస్తున్నారా? అని ప్రశ్నించారు.
దానికి జగన్ మాట్లాడుతూ.. దొరా, నువ్వు ఏ టీవీ ఛానల్ విలేకరో నాకు తెలియదు. ప్రతిపక్షంలో ఉండేది మేము. అదికార పక్షంలో ఉండేది వాళ్లు. రెండేళ్ల తర్వాత జీవో కాపీలతో సహా మేము చూపిస్తున్నాం. ఆధారాలతో సహా చూపిస్తున్నాం. చేతనైతే విచారణ జరిపించు. చంద్రబాబును ప్రశ్నించు. ఎందుకు అవినీతి చేస్తున్నావు అని బాబును ప్రశ్నించు' అని జగన్ అన్నారు.