Ys Jagan admits KCR Demand : ఎట్టకేలకు కేసీఆర్ డిమాండ్ కు ఒప్పుకున్న వైఎస్ జగన్.. ?
ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టంపై ఉమ్మడి సర్వే చేపట్టాలన్న కేసీఆర్ సర్కార్ డిమాండ్ కు వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్ర జలసంఘం ప్రకటించింది.
ఏపీ-తెలంగాణ విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా అసమగ్రంగా జరిగిన ఈ విభజన కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తప్పడం లేదు. ఇప్పటికీ పలు సంస్ధల విభజన పూర్తి కాలేదు. దీనిపై సుప్రీంకోర్టులో సైతం విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో చేపడుతున్న ఓ కీలక ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ సర్కార్ ఎప్పటి నుంచో ఓ డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇన్నాళ్లు అంగీకరించని ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పుకుంది.
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో వందలాది ఎకరాలు మునుగుతున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తోంది. అయితే తెలంగాణను ఏపీ నుంచి విభజించిన కేంద్రం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాదు ఈ ప్రాజెక్టుకు భవిష్యత్తులో తెలంగాణ నుంచి ఇబ్బందులు రాకుండా తెలంగాణ పరిధిలో ఉన్న ఏడు మండలాల్ని సైతం ఏపీలో కలిపేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు వివాదం సమసిపోయిందని భావించినా అలా జరగలేదు. విభజన తర్వాత పలుమార్లు గోదావరికి వరదలు రావడం, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో పలు ప్రాంతాలు మునగడం జరుగుతూనే ఉంది. దీంతో పోలవరం ప్రాజెక్టు వల్ల జరుగుతున్న నష్టంపై ఉమ్మడి సర్వేకు తెలంగాణ డిమాండ్ చేస్తోంది.

పోలవరం ప్రాజెక్టును 150 అడుగులకు నింపినప్పుడు తెలంగాణలోని పలు ప్రాంతాలపై ప్రభావం పడుతుందని కేసీఆర్ సర్కార్ వాదిస్తోంది. దీంతో కోర్టుల్లో దీనికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర జలసంఘం ఢిల్లీలో జనవరి 25న ప్రాజెక్టు ప్రభావిత రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ తో సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో పోలవరం ప్రభావంపై ఉమ్మడి సర్వేకు ఏపీ తరఫున హాజరైన అధికారులు అంగీకారం తెలిపినట్లు కేంద్ర జలసంఘం ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో పూర్తి క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications