ఆప్లా కాదు, టిడిపి పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతే: బాబుపై జగన్ ఫైర్
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన గురువారం అనంతపురంలో ఐదో రోజు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి పోటీచేసి 70కి 67 స్థానాల్లో గెలిచి ఘనవిజయం సాధించిందని, అదే మన రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపికి డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదని, దాంతో వారిపై వడ్డీభారం రూ. 12 వేల కోట్లు పడిందని, దీనంతటికీ కారణం బాబేనని అన్నారు.

రుణాలు మాఫీ కాకపోవడంతో డ్వాక్రా మహిళలు ఆందోళనలో ఉన్నారని, డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును బ్యాంకులు రుణాల ఖాతాలకు జమ చేసుకుంటున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు రూ. 57 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ రుణాలు మాఫీ కాకపోవడంతో కేవలం రూ. 13 వేల కోట్లే ఇచ్చారని తెలిపారు.
రైతన్నలు నూటికి 2, 3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల రుణాలు రెన్యువల్ కాలేదని, దాంతో వారికి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా దక్కలేదని చెప్పారు. ఏపీలో గత సీజన్లో వర్షాలు 36 శాతం తక్కువగా నమోదయ్యాయని, కరువు వచ్చినా చంద్రబాబు మాత్రం స్పందించడం లేదని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications