సజ్జలతో సహా ముఖ్యుల బాధ్యతలపై జగన్ తాజా నిర్ణయం..!!
మాజీ సీఎం జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఓటమి తరువాత పార్టీలో చేపట్టాల్సిన మార్పుల పై కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్య నేతలతో వరుసగా నిర్వహించిన సమీక్షల తరువాత కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. అందులో భాగంగా పార్టీ ముఖ్యుల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గం వరకు అవసరమైన మార్పుల దిశగా జగన్ తన కసరత్తు ముమ్మరం చేసారు.
జగన్ కసరత్తు
ఎన్నికల్లో ఓటమితో జగన్ లో మార్పు కనిపిస్తోంది. సీఎంగా ఉన్న సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలు..తన కోటరీ గురించి విమర్శలు రావటంతో దిద్దబాటు చర్యలు మొదలు పెట్టారు. ముఖ్యమంత్రిగా జగన్ ను కలవాలంటే నాడు సజ్జల, ధనుంజయ రెడ్డి వ్యవహరించిన తీరు పైన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వలేదని వాపోయారు. పార్టీ నేతలు.. సాధారణ జనంతో జగన్ దూరంగా ఉండటం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఓటమికి కారణమయ్యాయని పలువురు నేతలు పేర్కొన్నారు.

నేతల బాధ్యతల్లో మార్పు
దీంతో, జగన్ తాను పార్టీ నేతలకు ఇక అందుబాటులో ఉండాలని డిసైడ్ అయ్యారు. తన క్యాంపు నివాసంలోనే పార్టీ కార్యాలయం ప్రారంభించారు. గతం కంటే భిన్నంగా తానే నేరుగా వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రతీ అంశంలో స్పందించే సజ్జల పూర్తిగా సైలెంట్ అయ్యారు. జగన్ సమీక్షలకు హాజరవుతున్నా..మీడియా ముందుకు రావటం లేదు. పేర్ని నాని ద్వారా పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి కొత్తగా అధికార ప్రతినిధుల నియామకం పై జగన్ కసరత్తు చేస్తున్నారు.
కీలక నియామకాలు
సజ్జల కేవలం పార్టీ వ్యవహారాల్లో పరిమితం కానున్నారు. పార్టీ నేతల సమన్వయ బాధ్యతలను విజయ సాయిరెడ్డి,సుబ్బారెడ్డికి అప్పగించాలని డిసైడ్ అయ్యారు. రీజనల్ కో ఆర్డినేటర్లలోనూ మార్పులు జరగనున్నాయి. అదే విధంగా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుల మార్పు ఖాయమైంది. గతంలో నియోజకవర్గాల ఇంఛార్జ్ లను మార్చి ఎన్నికల సమయంలో జగన్ ప్రయోగం చేసారు. అయితే, పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూనే..సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ..కోటరీ నేతలకు పరిమితులు ఖరారు చేస్తూ..తాను ప్రతీ సందర్భంలో అందుబాటులో ఉండేలా జగన్ కొత్త కార్యాచరణ ప్రకటనకు సిద్దమయ్యారు.












Click it and Unblock the Notifications