సుమంత్-జగన్ ఫ్రెండ్షిప్ : ఆరోజుల్లో.. ఇద్దరూ ఎంతలా ఎంజాయ్ చేశారంటే!
హైదరాబాద్ : మనదేశంలో సినిమాలకు-రాజకీయాలకు ఏదో అవినాభావ సంబంధం ఉండుంటుంది. అందుకే.. సినిమాల్లోంచి రాజకీయాల్లోకి.. రాజకీయాల్లోంచి సినిమాల్లోకి దూకేవారి సంఖ్య మన దగ్గర ఎక్కువే. ఈ రెండు రంగాలు చాలాకాలంగా పక్కపక్కనే ఉంటూ వస్తున్నాయి. ఏళ్లుగా కొనసాగుతున్న సినీ-రాజకీయ మిత్రుత్వంలో ఎంతోమంది తారసపడుతారు.
టాలీవుడ్ హీరో సుమంత్, వైసీపీ అధినేత జగన్ మధ్య మిత్రుత్వం కూడా అలాంటిదే. వీరిద్దరు ఒకే క్లాస్.. ఒకే బెంచ్. స్కూల్ డేస్ లో వీరిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉండేది. సాయంత్రాలు చట్టపట్టాలేసుకుని తిరగడం.. పొద్దుపోయే దాకా.. ఎక్కడెక్కడో తిరిగి.. రాత్రవగానే దొడ్డిదారిన ఇంట్లోకి దూరే ప్రయత్నాలు చేయడం.. లాంటి తీపి గుర్తులన్నిఅప్పట్లో వీరి ఫ్రెండ్ షిప్ ఎంత స్ట్రాంగ్ అనేది చెబుతున్నాయి.
ఈ విషయాలన్ని హీరో సుమంత్ స్వయంగా వెల్లడించారు. ఓ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా.. 25ఏళ్ల క్రితం నాటి ఆ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు సుమంత్. అప్పట్లో జరిగిన ఓ ఘటన గురించి చెబుతూ... 'రాత్రి పొద్దుపోయి ఇంటికొచ్చాక.. దొంగచాటుగా పైనున్న బెడ్ రూమ్ కు వెళ్లేందుకు గ్రిల్ పట్టుకుని ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతలో తాతయ్య నాగేశ్వరరావు గారు చూడడంతో.. తాతా అతని పేరు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు' అంటూ జగన్ గురించి పరిచయం చేశానని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ఆరోజుల్లో.. ఇద్దరం కలిసి చాలానే ఎంజాయ్ చేశామని చెప్పాడు సుమంత్. సుమంత్-జగన్ ల ఈ 'దోస్త్ మేరా దోస్త్' కహానీ ప్రస్తుతం అందరి నోటా హాట్ టాపిక్ గా మారింది.