జగన్కు 'తెలంగాణ' ఆయుధం: రేవంత్ బాస్ చంద్రబాబే
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి వ్యవహారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన ఆయుధంగా కనిపిస్తోంది. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్ సన్కు రూ.5 కోట్ల డీల్, రేవంత్ తదితరుల అరెస్టుపై వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది.
ప్రధానంగా ఆ పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు తదితరులు నిప్పులు చెరుగుతున్నారు. అంబటి రాంబాబు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రేవంత్ వ్యవహారంలో చంద్రబాబే మొదటి ముద్దాయి అన్నారు. ఈ కేసులో దొరకని దొంగలు ఉన్నారన్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు అన్నారు. రేవంత్ బాస్ చంద్రబాబే ప్రధాన నిందితుడు అని ఆరోపించారు.
చంద్రబాబు పైన ఏ వన్ కేసు అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి వారు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ఏపీలో దోచుకొని తెలంగాణలో పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారన్నారు. కేసులు తారుమారు చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు.
కేసీఆర్ వల్లే రేవంత్ వ్యవహారం బయటపడింది: ఉండవల్లి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పూనుకోవడం వల్లే తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారం బయటపడిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏఫీకి ప్రత్యేక హోదా కోసం అధికార టీడీపీ విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వెళ్లాలన్నారు.