చంద్రబాబుకు అల్టిమేటం ఇస్తున్నా: జగన్, టిడిపి శ్రేణుల ఘర్షణ
ఏలూరు: పొగాకు రైతుల సమస్యలపై తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అల్టిమేటం ఇస్తున్నానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. కాగా, వైయస్ జగన్ పర్యటన సందర్భంగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లా దేవరాపల్లి పొగాకు వేలం కేంద్రంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
దేవరాపల్లి పొగాకు వేలం కేంద్రంలో రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, వైసిపి కార్యకర్తలకు మధ్య ఘర్షణ, తోపులాట చోటు చేసుకుంది. కిలో పొగాకుకు రూ.150కి తగ్గకుండా మద్దతు ధర కల్పించి, స్టేట్ ట్రేడింగ్ కార్పోరేషన్ ద్వారా కొనుగోళ్లు చేయించాలని, లేదంటే ఈ నెల 10వ తేదీ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద తమ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు చేపడుతామని జగన్ చెప్పారు.

చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని, ఇంతటి సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని తాను ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. పొగాకును గతంలో 120 రోజుల పాటు కొనుగోలు చేసేవారని, ఇప్పుడు దాన్ని కేవలం 80 రోజులకే పరిమితం చేశారని, అలాగే ఆయిల్ టన్ను ధర 8267 రూపాయుల ఉంటే ఇప్పుడు 6473 రూపాయలు మాత్రమే ఉందని, దాదాపు రెండు వేల రూపాయలు తగ్గిందని ఆయన వివరించారు.
చెరుకు మద్దతు ధర కూడా దారుణంగా ఉందని ఆయన అన్నారు. రైతులు తమకు ఇష్టం ఉన్నా, లేకున్నా కర్మాగారాలకు వెళ్లి చేరుకును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. రైతులకు రవాణా ఖర్చుతో కలిపి రూ.900 వరకు ఖర్చవుతుంటే, ఫ్యాక్టరీ వాళ్లు కేవలం 700 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆయన చెప్పారు. గత సంవత్సరం బకాయిలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
అరటిపండ్లు గతంలో గెల రూ.250 -400 పలికితే ఇప్పుడు కనీసం 50 రూపాయలకు కూడా కొనే పరిస్తితి లేదని ఆయన అన్నారు. రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని చెప్పబట్టి రుణాలు తిరిగి చెల్లించవద్దని చెప్పారు కాబట్టి ఊరుకున్నారని, దాంతో గతంలో 3 లక్షల వరకు పావలా వడ్డీకి వచ్చే రుణాల మీద అపరాధ వడ్డీ రూపంలో 14-18 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. అందుకు కారణం చంద్రబాబేనని ఆయన దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications