జగన్కు ఊరట: ఇక ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లాల్సిన పని లేదు
హైదరాబాద్: 'ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కాల్సిన మీరా?... మాకు చెప్పేది'' అంటూ ఏపీలో అధికార పార్టీ టీడీపీ నేతలు వైసీపీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్పై విరుచుకుపడేందుకు ఇకపై వారికి ఆ అవకాశం లేదు. అదేంటీ వైయస్ జగన్పై నమోదైన అక్రమాస్తుల కేసు వీగిపోయిందా? అనుకుంటే పోరపాటే.
అక్రమాస్తుల కేసు విచారణలో బాగంగా సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రతి శుక్రవారం హాజరు నుంచి ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్కు హైకోర్టు మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే... తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ జగన్పై 11 కేసులు పెట్టింది.
ఈ కేసులకు సంబంధించి చార్జిషీట్లను కూడా కోర్టులో దాఖలు చేసింది. రెండు రోజుల క్రితం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కోర్టులో మరో చార్జిషీట్ను దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన 11 కేసులను ప్రతి శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది.
ఈ విచారణకు జగన్తో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని కోర్టు చెప్పింది. దీంతో ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతున్నావంటూ జగన్పై టీడీపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యాఖ్యలకు జగన్ అసహనానికి గురయ్యారో ఏమో తెలియదు.
ప్రతిపక్ష నేతగా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తాను అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో... జగన్కు ఊరటనిస్తూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్ కేసులో నిందితుడిగా ఉన్న దాల్మియాకు కూడా ఊరట లభించింది. ఇదే వ్వవహారంలో పెన్నా ప్రతాప్ రెడ్డిపై విచారణను, హాజరు ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏప్రిల్ 20 వరకు పొడిగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో ఆదేశాలు జారీ చేశారు.