కిరణ్కు కితాబు: ఎస్పీవై రెడ్డిపై వైయస్ జగన్ ఆగ్రహం
హైదరాబాద్: పార్టీ కార్యలయం వేదికగా పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి చేసిన వాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మండిపడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యలయంలో మీడియాతో మాట్లాడిన ఎస్పీవై రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని సమైక్య హీరో, సమైక్య సింహం అని పొగిడిన విషయం తెలిసిందే.
తాను సమైక్య శంఖారావం సభలు నిర్వహిస్తూ సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఎస్పీవై రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి కితాబు ఇచ్చి నష్టం చేశారనే ఆగ్రహంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. సమైక్య శంఖారావంలో భాగంగా నెల్లారులో పర్యటిస్తున్న జగన్, పార్టీ సీనియర్లు, ముఖ్యనేతలకు శనివారం ఫోన్చేసి ఎస్పీవై రెడ్డి చేసిన వాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి ఫోన్లో జగన్ చాలా ఆగ్రహంగా మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
ఒక పార్టీ వేదికపై మరో పార్టీ నేతను ఎలా ప్రశంసిస్తారని జగన్ ప్రశ్నించారు. ఆయనపై జగన్ క్రమశిక్షణా చర్యలకు దిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్పీవై రెడ్డి పై చర్యలు తీసుకుంటే ఆయన ఎలా స్పందిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎస్పీవై రెడ్డి వ్యవహారాన్ని ఇలానే వదిలేస్తే వేరే విధంగా సంకేతాలు వెళ్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
దాంతో నంద్యాలలో మీడియా సమావేశం నిర్వహించి స్వయంగా ఎస్పీవై రెడ్డి చేతనే వివరణ ఇప్పించడానికి పార్టీ యత్నిస్తునట్లు తెలుస్తుంది. మీడియా సమావేశంలో ఏ విషయాలు మాట్లాడాలనే దానిపై హైదరాబాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యాలయం నుండి కొందరు ముఖ్యనేతలు ఇప్పటికే ఎస్పీవై రెడ్డితో చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం.