బాబుని కార్నర్ చేసేందుకు జగన్కు ఛాన్స్, ఏపీకి వెంకయ్య అవసరం!
విజయవాడ/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో 'ప్రత్యేక' అవకాశం వచ్చింది. విపక్ష నేతగా వైయస్ జగన్ విఫలమవుతున్నారని ఓ వైపు టిడిపి, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు కూడా చెబుతున్నాయి.
అయితే, ప్రత్యేక హోదా రూపంలో జగన్కు ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పైన పైచేయి సాధించడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఓ కారణంతో జగన్ మళ్లీ బోర్లా పడుతున్నారనే వాదనలు ఉన్నాయి.
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం మొదలు.. వైసిపి ఎమ్మెల్యే రోజా వరకు జగన్ ఓ విధంగా బోర్లా పడ్డారని అంటున్నారు. అయితే, ఇప్పుడు ప్రత్యేక హోదా రూపంలో జగన్కు మరోసారి అవకాశం వచ్చిందని, అయితే, కేవలం చంద్రబాబును టార్గెట్ చేయకుండా, కేంద్రాన్ని నిలదీస్తే బాగుంటుందని అంటున్నారు.
జగన్ ప్రత్యేక హోదా విషయంలో కేవలం చంద్రబాబునే నిలదీయడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును నిలదీయడంలో తప్పులేదని, కానీ అంతకంటే ఎక్కువగా ప్రశ్నించాల్సింది బీజేపీని అని చెబుతున్నారు. కానీ జగన్ రాజకీయ కోణంలో ఆలోచించి కేవలం బాబునే టార్గెట్ చేశారని అంటున్నారు.
ఈ నెల 13వ తేదీన ప్రత్యేక హోదా సహా, విభజన చట్టంలో పలు సవరణలు సూచిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరగనున్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది.
ప్రధానంగా ఇది జగన్కి ప్రత్యేక ఛాన్స్ అని చెప్పవచ్చునని అంటున్నారు. హోదాపై పోరులో భాగంగా ఈ రోజు వైసిపి శ్రేణులు రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టే ఆందోళనల్లో జగన్ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో జగన్ పోరు చేస్తే వైసిపికి రాజకీయంగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒక్కరోజు ఉద్యమంతో వైసిపి సరిపోదని, 13వ తేదీ రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ నేపథ్యంలో ఉద్యమ సెగ, ఢిల్లీకి తాకేలా ఉండాలని అంటున్నారు.
అంటే అమరావతి శంకుస్థాపన సమయంలో గుంటూరులో జగన్ ప్రత్యేక హోదా కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ దీక్ష అలాగే కొనసాగి ఉంటే, జగన్ దీక్ష సెగ ప్రధాని మోడీకి తగిలేదని, దీక్ష విషయంలో ప్రభుత్వం తనదైన రాజకీయాలు చేయడం, దీక్షా వేదికల్ని మార్చడం, దీక్ష చేసే టైమింగ్ని జగన్ మార్చుకోవడం.. ఇలాంటి అంశాలతో దీక్ష తాలూకు ప్రభావం కనిపించలేదని అంటున్నారు.
ఏపీకి వెంకయ్య అవసరం!
ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పడం వలన రాష్ట్రంలో టిడిపి, బిజెపిలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, టిడిపి నేతలు కేంద్రంపై ఆగ్రహం చేశారు. ఆ తర్వాత కొంత తగ్గారు. అయితే, హోదా వ్యవహారంతో బిజెపి, టిడిపి మధ్య విభేదాలు పెరిగాయనే వాదనలు వినిపించినా, ఏపీ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ అంత వరకు తెచ్చుకోదనే చెప్పవచ్చు.
బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే టిడిపికి, రాష్ట్రానికి నష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యతతో ఉండి మరిన్ని నిధులు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అయితే, హోదాపై కేంద్రం షాకిచ్చిన నేపథ్యంలో చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి షాకిస్తారా అనే చర్చ కూడా సాగుతోంది.
టిడిపి - బిజెపి మిత్రపక్షం. కాబట్టి వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఒకరికి చంద్రబాబు రాజ్యసభకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. వెంకయ్య నాయుడు ఇప్పటికే ఏపీ నుంచి నో చెప్పినట్లుగా ఊహాగానాలు వినిపించాయి.
ఎక్కడి నుంచి అయినప్పటికీ.. టిడిపి - బిజెపి దోస్తీ, వెంకయ్య అవసరం ఏపీకి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి వెంకయ్యకు రాజ్యసభ కేటాయిస్తే.. ఏపీకి కేంద్రం సహకారం మరింత ఎక్కువ ఉండవచ్చునని అంటున్నారు. మోడీ వద్ద వెంకయ్యకు ఉన్న పలుకుబడి పనికి వస్తుందంటున్నారు.
ప్రధాని మోడీతో వెంకయ్యకు సాన్నిహిత్యం ఉంది. ఆయన తన పని తీరుతో ప్రధాని మోడీని ఆకట్టుకున్నారు. చంద్రబాబు మిత్రపక్షం కాబట్టి.. ఆయన వల్ల కాని పనులు వెంకయ్య వల్ల అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. వెంకయ్యను నిందిస్తే మొదటికే మోసం అని అంటున్నారు.