2019 ఆశలు: వచ్చేస్తున్నాం... లెక్కలు చెప్తున్న జగన్!
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటమిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని, తప్పకుండా అధికారంలోకి వస్తామని, 20 నుండి 25 లోకసభ స్థానాలు గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పుతామని ఎన్నికలకు ముందు ఆ పార్టీ బల్లగుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు ఎన్నికల్లో సీన్ రివర్స్ కావడంతో జగన్ 2019లో వస్తామని లెక్కలు చెబుతున్నారు.
అయితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల అయినప్పుడే సార్వత్రిక ఎన్నికల ఫలితం దాదాపు తెలిసిపోయింది. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం తాము 140కి పైగా స్థానాలు గెలుచుకుంటామని చెబుతూ వచ్చింది.
మున్సిపల్, పరిషత్ ఎన్నికలలో ఓటమిపై స్పందిస్తూ.. మున్సిపల్ కంటే పరిషత్ ఎన్నికల్లో తాము మంచి ప్రభావం చూపామని, మున్సిపల్ తర్వాత పరిషత్, పరిషత్ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరిగాయని, ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో తాము ప్రభావం చూపనప్పటికీ.. పరిషత్లో టిడిపికి గట్టి పోటీ ఇచ్చామని, ఇవి తమకు అనుకూలంగా వచ్చాయని, ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరింత సత్తా చాటుతామని, 140 స్థానాల వరకు గెలుచుకుంటామని చెప్పారు.
అయితే అనూహ్యంగా ఆ పార్టీ డెబ్బైలోపు స్థానాలనే కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పైన జగన్ మాట్లాడుతూ... తాను కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు తాను, తన తల్లి మాత్రమే ఉన్నామని, ఆ తర్వాత తనకు ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు జత కలిశారని, వారు ఇప్పటికీ తనతోనే ఉన్నారని.. అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై వరకు సీట్లు గెలుచుకొని ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తామే వస్తామని లెక్క చెప్పారు. తమ ఓటమికి చంద్రబాబు అబద్దపు హామీలు, మోడీ హవా తోడైందని కూడా చెప్పారు.
అదే సమయంలో గత నాలుగేళ్లుగా ప్రజా సమస్యలు ఎక్కడుంటే జగన్ అక్కడున్నాడని, చంద్రబాబు లేరని జగన్ చెప్పారు. రైతులు, విద్యార్థి, వికలాంగుల సమస్యలు వస్తే తానే ధర్నాలు, ఆందోళనలు చేశానని చెప్పారు.
అయితే దీనిపై తెలుగు తమ్ముళ్లు స్పందిస్తున్నారు. సమస్యలు ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు ప్రత్యక్షమయ్యారని చెబుతున్నారు. ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు, గల్ఫ్లో తెలుగు వారు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, ఉత్తర తెలంగాణలో బాబ్లీ ప్రాజెక్టు, రైతు.. ఇలా అన్ని సమస్యల పైన ఎవరు స్పందించారని ప్రశ్నిస్తున్నారు.