చంద్రబాబుపై వైయస్ జగన్ ఒత్తిడి: కెసిఆర్తో చిరాకు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నారు. పరిస్థితులను చక్కదిద్దుకుని నిలదొక్కుకోవడానికి తగిన అవకాశం ఇవ్వకుండా చంద్రబాబుపై రాజకీయ పోరాటం సాగిస్తున్నారు.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దూకుడు ప్రదర్శిస్తూ చంద్రబాబును చిరాకు పెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇంత కాలం కెసిఆర్ చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు. అయితే, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో, ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో కెసిఆర్ విధానం చంద్రబాబును ఇరకాటంలో పడేస్తోంది. మరోవైపు రైతు రుణాల మాఫీ వ్యవహారం ఆయనకు తలనొప్పిగా మారింది. కెసిఆర్ విధానాల్లోని హేతుబద్దతను పక్కనపెడితే చంద్రబాబుకు అది ఇబ్బందికరంగానే ఉంది.
వైయస్ జగన్ అవకాశం చిక్కితే చాలు ప్రజల్లోకి వెళ్తూ చంద్రబాబు ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. విజయనగరం జిల్లాలో చెన్నైలో భవనం కూలడం వల్ల మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించి, ప్రజల్లో ఉండడానికి జగన్ ప్రయత్నిస్తూ చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. గురువారంనాడు ఆయన శ్రీకాకుళం జిల్లాలోని బాధితులను పరామర్శించారు.

రైతుల రుణమాఫీ వ్యవహారంపై జగన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. రైతు రుణమాఫీ కోసం నిరాహార దీక్షకు సైతం తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రుణమాఫీకి హామీ ఇచ్చామని చంద్రబాబు చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
చంద్రబాబు రుణమాఫీని మరిచిపోయి రీషెడ్యూల్ గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రుణమాఫీ విషయంలో కాలయాపన కోసమే కోటయ్య కమిటీని వేశారని ఆయన విమర్శించారు. రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి తక్షణ సమస్యలు చంద్రబాబును ఇబ్బంది పెడుతుండగా, హైదరాబాదు నుంచి పాలన సాగించాల్సి రావడం మరో ఇబ్బందిగా మారింది.
ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రజలకు నమ్మకం కలిగించడానికి జిల్లా పర్యటనలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. తన పర్యటనల ద్వారా ప్రజలు దూరం కాకుండా చూసుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications