విజయమ్మ అంతేనని జగన్కు చెప్పా: కొణతాల
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అబద్దాల కోరు, తనకు నచ్చని వారిని బయటకు పంపేందుకు ఎంతటి దురాగతాలకు పాల్పడేందుకైనా వెనుకాడబోరని ఆ పార్టీ నుండి ఇటీవల బహిష్కరణకు గురైన మాజీమంత్రి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.
పార్టీని వీడాక తొలిసారిగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అభిమానులు, ముఖ్యనేతలతో బుధవారం సమావేశమై ఆ విధంగా స్పందించారు. జగన్ నుండి అడుగడుగునా ఏ విధమైన అవమానాలు జరిగాయి, ఆయన పార్టీనేతలపై ఎంత నియంతలా వ్యవహరిస్తారనే విషయాలతోపాటు పార్టీ పదవి రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు.
విశాఖపట్నం ఎంపి పదవికి విజయమ్మను పోటీకి దింపితే ప్రతికూల పరిస్థితులు వస్తాయని జగన్కు ముందే చెప్పానన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా విజయమ్మ గెలుపొందాలంటే లోక్సభ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశమై కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని జగన్కు సూచించానని, అయినా ఆయన పట్టించుకోలేదని వివరించారు.

ఎన్నికల ఫలితం వెలువడ్డాక విశాఖలో జరిగిన సమీక్షలో కొణతాల చెప్పారు కాబట్టే విజయమ్మను పోటీకి దింపానని చెప్పడం తనకెంతో బాధ కలిగించిందన్నారు. విజయమ్మను పోటీకి దింపవద్దని తాను చెప్పినప్పుడు వైసిపి రాజకీయ సలహాదారు రామకృష్ణారెడ్డి, ఇతర ముఖ్యనేతలు కూడా ఉన్నారన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జి నియామకాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కీలకమైన నేతగా ఉంటూ వచ్చిన కొణతాల రామకృష్ణ ఇటీవల తన పార్టీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నచ్చజెప్పినా వినకపోవడంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొణతాల రామకృష్ణ బిజెపి వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications