రేపటి నుంచి అసెంబ్లీ: జగన్ వ్యూహం ఇదే, చంద్రబాబును ఎండగడతారా?
హైదరాబాద్: గురువారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ శాసనసభాపక్షం బుధవారం సమావేశమైంది. హైదరాబాద్లోని లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీసేందుకు జగన్ వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయాలని ఇప్పటికే జగన్ ఓ ప్రణాళికను సిద్ధం చేశారు.
ఈ మేరకు వైసీపీ పార్టీ దీనిపై వ్యూహాన్ని రచిస్తోంది. ఇటీవల కాలంలో చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంలో కదలికి రావడంతో పాటు రాష్ట్రంలో కరువు, రాజధాని కుంభకోణం, ప్రత్యేక అంశాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది. మొత్తం 36 అంశాలను సభలో లేవనెత్తాలని ప్రతిపక్షనేత జగన్ నిర్ణయించారు.
ఆయా అంశాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారని సమాచారం. ఈ సమావేశం అనంతరం వైసీపీ శాసనసభాపక్షంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోన రఘుపతి, ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు.
ప్రత్యేక హోదా, ఓటుకు నోటు, రాజధాని భూ కుంభకోణం, కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వ వైఫల్యంతో పాటు మిగిలిన అంశాలను సభలో చర్చించాలని పట్టుబడతామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను తూతా మంత్రంగా నిర్వహించకుండా కనీసం 15 నుంచి 20 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తామని అన్నారు.
ప్రత్యేక హోదాపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరతామని చెప్పారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తీరును ఎండగడతామని చెప్పారు. యుద్ధం ప్రారంభం కాకముందే తెల్లజెండా చూపి వెనుదిరిగిన పిరికి సైనికుడు చంద్రబాబు అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే సీఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ప్రకటించగలరా? అని నిలదీశారు. ప్రత్యేక హోదాపై వెనకడుగు వేస్తే రాష్ట్ర భవిష్యత్ నాశనం అవుతుందని, చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరస్తుడిలా తలదించుకోవడం ఏపీ ప్రజలకు అవమానంగా ఉందని, ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసరాలని వారు డిమాండ్ చేశారు.