ఆ ఇద్దరి గురించి ఆలోచిస్తున్న వైఎస్ జగన్!!
వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం ఎంత కష్టమో ముఖ్యమంత్రి జగన్ కు తెలుసు. అందుకే ప్రతి చిన్న అంశాన్ని తరచి తరచి విశ్లేషిస్తున్నారు. తానొక్కడినే బటన్ నొక్కడంవల్ల ఉపయోగం ఉండదని, 175 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జిలు అందరూ మంచి పనితీరు కనపరిస్తేనే అధికారం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఇంకా బాగా పనిచేయాలని.. రేపు ఓటమిపాలైనా, అధికారం కోల్పోయినా బాధపడేది మనమేనంటూ వారిని పదే పదే హెచ్చరిస్తున్నారు.

వారిద్దరూ మారడంలేదు!
వర్క్ షాప్ పెట్టిన ప్రతిసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జిలందరూ మారాల్సిందేనని, లేదంటే తర్వాత ఎన్నికల కోసం సీటివ్వనని చెప్పేస్తున్నారు. తాజాగా జరిగిన వర్క్ షాప్ లో కూడా హెచ్చరికలు జారీచేయడంతోపాటు ప్రత్యేకంగా ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించారు. ఎన్నిసార్లు హెచ్చరికలు చెప్పినా వారిద్దరు మాత్రం మారడంలేదన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల నాని.

పనితీరు సరిగా లేదమ్మా!
వీరిద్దరు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడంలేదని, పూర్తిగా వెనకబడ్డారని గత సమావేశంలోనే పేర్లు చదివి జగన్ స్వయంగా వెల్లడించారు. ఈసారి వర్క్ షాప్ లో కూడా వారిద్దరికి మరోసారి హెచ్చరికలు జారీచేసినట్లు సమాచారం. పనితీరు మెరుగు పరుచుకోవాల్సిన 27 మంది ఎమ్మెల్యేల్లో వీరిద్దరి పేర్లు కూడా ఉన్నాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో వీరిద్దరూ 25 శాతం కూడా పెర్ ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారని, ఏమాత్రం అలసత్వం పనికిరాదని హెచ్చరించారు.

ఖరాఖండిగా చెబుతున్న జగన్!
పనితీరు మార్చుకోవాల్సినవారంతా కచ్చితంగా కష్టపడాల్సిందేనని, వారంలో నాలుగు రోజులు ప్రజల్లో ఉండాల్సిందేనని జగన్ ఖరాఖండి చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడంద్వారా ప్రజలకు చేరువవుతారని, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతారని, కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించవచ్చనేది జగన్ యోచన.
దీనిద్వారా ప్రజలకు ప్రభుత్వంపై సదభిప్రాయం కలుగుతుందని, అది రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జగన్ చెప్పిన మాటను ఎంతవరకు ఆలకిస్తున్నారనేది ఈసారి వర్క్ షాప్ జరిగినప్పుడు పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుంది.












Click it and Unblock the Notifications