నలుగురు ఎమ్మెల్యేలు జంప్కు రెడీ: బుజ్జగిస్తున్న జగన్
హైదరాబాద్: ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశంలోకి ఫిరాయించడానికి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నాలుగో సీటును కూడా గెలుచుకోవడానికి సాధ్యమైనంత ఎక్కువ మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను టిడిపిలోకి తీసుకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
దీంతో జగన్ అప్రమత్తమై శాసనసభ్యులను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారడానికి సిద్ధపడుతున్న ఎమ్మెల్యేల వివరాలను వేగుల ద్వారా తెలుసుకుని, వారిని బుజ్జగించేందుకు జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతున్న ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, మేకా ప్రతాప్ అప్పారావులను రెండు రోజుల కిందట పిలిపించుకొని జగన్ వారితో చర్చించినట్లు సమాచారం.
వారికి తగిన అభయమిస్తూ నచ్చజెప్పేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. గొట్టిపాటి రవి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న ప్రకాశంజిల్లాలో ఆ పార్టీకి తీవ్ర నష్టంవాటిల్లుతుందన్న ప్రచారం సాగిన విషయం తెలిసిందే.

రాజ్యసభ ఎన్నికల కోసమే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత టీడిపిలో తగిన ప్రాధాన్యత ఉండదని, పోయేవారు ఈ విషయాన్ని ఆలోచించుకోవాలని, పార్టీలో మీకు ఏం తక్కువ చేశామని పార్టీ వీడే యోచనలో ఉన్న ఎమ్మెల్యేలతో జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికల్లో వలస వచ్చిన తమ ఎమ్మెల్యేలతో తమ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. తద్వారా తమ పార్టీ బలహీనపడిందన్న సంకేతాలు జనంలోకి అధికారపక్షం పంపే ప్రయత్నం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో తమ పార్టీని బతికించుకోవాలంటే పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోవాలన్న యోచనలో తమ పార్టీ అధినేత జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications