సీఎం జగన్ అసాధారణ అడుగు - జస్టిస్ ఎన్వీ రమణపై పోరు ఉధృతం - రాష్ట్రపతి, ప్రధాని వద్దకు..
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారును అస్థిరపరిచేలా న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తున్నదని, ప్రతిపక్ష నేత చద్రబాబుకు అనుకూలంగా, ఏపీ హైకోర్టు జడ్జిలు తీర్పలు, ఆదేాశాలు ఇస్తున్నారని, ఈ వ్యవహారాల్లో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అసాధారణ అడుగుకు సిద్ధమయ్యారు. జస్టిస్ రమణపై పోరును ఉధృతం చేస్తున్నట్లు ఇప్పటికే వైసీపీ వర్గాలు పలు సంకేతాలు ఇస్తుండగా, దీనిపై సీఎం జగన్ మరోసారి కీలక పర్యటన జరపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.

లేఖ రాసి వారం కావొస్తున్నా..
దేశచరిత్రలోనే తొలిసారి ఓ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి, అది కూడా త్వరలో చీఫ్ జస్టిస్ కావాల్సిన వ్యక్తిపై ఒక ముఖ్యమంత్రి ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఈ వ్యవహారంపై సీజేఐకు ఫిర్యాదు లేఖ రాయడమే కాకుండా దాన్ని మీడియాకు బహిర్గతం చేయడం సంచలనం రేపింది. న్యాయ, శాసన వ్యవస్థల మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశం కావడంతో జగన్ లేఖపై సీజేఐ జస్టిస్ బోబ్డే ఆచితూచి వ్యవహరిస్తున్నారని, కాబట్టే వారం రోజులు కావొస్తున్నా సదరు ఫిర్యాదుపై సీజేఐగానీ, ఆయన కార్యాలయంగానీ ఎలాంటి తొందరపాటు ప్రకటన చేయలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కాగా, ఈ వ్యవహారంలో జగన్ తదుపరి అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే దేశాధినేతల వద్దకు వెళ్లాలని ఏపీ సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రపతి, ప్రధానితో భేటీకి..
ఏపీ సీఎం, సుప్రీం జడ్జిల మధ్య సాగుతోన్న వ్వహారాన్ని జాతీయ మీడియా ‘యుద్ధం'గా అభివర్ణించడం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణపై పోరును ఉధృతం చేయడంలో భాగంగా ఏపీ సీఎం జగన్.. రాజ్యాంగ అధినేత, రాష్ట్రపతి అయిన రామ్ నాథ్ కోవింద్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వాధినేత ప్రధాని నరేంద్ర మోదీతో సైతం మరోసారి సమావేశం కావాలనుకుంటున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం.. రాష్ట్రపతి, ప్రధానమంత్రుల అపాయింట్మెంట్ కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మరోసారి ఢిల్లీకి జగన్..
రాష్ట్ర అధినేత హోదాలో సీఎం జగన్ పలు మార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినప్పటికీ, గతవారం జరిపిన పర్యటన అత్యంత కీలకంగా ఉండింది. ఈనెల 6న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన రోజే సీఎం జగన్.. సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డేను కలిసి, జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు లేఖను అందించినట్లు సీఎం సలహాదారు అజయ్ కల్లాం ఇటీవలే మీడియాకు తెలిపారు. కాగా, తదుపరి వ్యూహంలో భాగంగా మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు జగన్ రెడీ అయ్యారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రుల అపాయింట్మెంట్ ఖరారైన మరుక్షణమే ఆయన ఢిల్లీకి పయనం కానున్నారని తెలుస్తోంది.

ఆ జడ్జిలపై విచారణకు వైసీపీ పట్టు..
ఎన్డీఏ నుంచి పలు పార్టీలు ఒక్కొక్కటిగా దూరమవుతోన్న తరుణంలో.. దేశంలోనే అత్యధిక ఎంపీలు కలిగిన మూడో పార్టీగా వైసీపీ.. కేంద్రం తీసుకొచ్చిన కీలక బిల్లులకు మద్దతు తెలపడం, మోదీ సర్కారు నిర్ణయాలకు బాసటగా నిలబడటం రాజకీయ సమీకరణాల్లో మార్పునకు సంకేతంగా గోచరిస్తాయి. అయితే, హైకోర్టు జడ్జిలు, సుప్రీం జడ్జిపై ఫిర్యాదు రాజకీయ అంశం కానప్పటికీ, జగన్ తన లేఖలో హైకోర్టు జడ్జిలు, సుప్రీం జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ.. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఎవరో ఒకరు రాష్ట్రపతి జోక్యాన్ని కోరే అవకాశం ఉండటంతో జగన్ ముందుగానే కోవింద్ ను కలిసేందుకు ప్రయత్నాలు ఆరంభించడం కీలకంగా మారింది. జస్టిస్ రమణ, ఇతర జడ్జిలపై విచారణ జరగాల్సిందేనని వైసీపీ కోరుతున్న వేళ ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications