‘లోక్యాష్ బాబు’ అని వారే అంటున్నారు: బాబుపై జగన్ నిప్పులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పంటల దిగుబడి తగ్గిపోయిందని అన్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పంటల దిగుబడి తగ్గిపోయిందని అన్నారు. రైతులు దీనస్థితిలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరు నల్లపాడు రోడ్డులో రైతు సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టిన జగన్కు మంగళవారం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు రైతులు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పంటకూ మద్దతు ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 19 రకాల పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదని అన్నారు. దాదాపు 40శాతం మంది రైతులు చేతులెత్తేసే పరిస్థితి నెలకొందని అన్నారు.
కరువులో చంద్రబాబు రికార్డును ఆయనే బద్దలు కొట్టారని జగన్ ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకుంటామని 5వారాల క్రితం అసెంబ్లీ చెప్పారని, ఇప్పుడు రైతులు దీన స్థితిలో ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిర్చి ధర రూ.2 వేల నుంచి 4వేల ధర పలుకుతుంది. విభజన తర్వాత ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారిందన్నారు. రైతుకు ఎలా అండగా నిలబడాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదన్నారు.

రైతులు పశుగ్రాసం లేక పశువులను కబేళాలకు తరలిస్తున్నారని అన్నారు. రైతులు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు కూలీ పనుల కోసం వెళుతున్నారని అన్నారు. కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి గుంటూరుకు పంటలు తీసుకువస్తే ఇక్కడ కొనడం లేదని తెలిపారు. ఇక్కడి వరకూ తీసుకువచ్చి పంటలు అమ్మితే.. రైతులకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని అన్నారు.
రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదని, వడ్డీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. మద్దతు లభించక శ్రీకాకుళం, విజయనగరం, ఇతర జిల్లాల రైతులు రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. అయినా చంద్రబాబులో చలనం లేదని మండిపడ్డారు. అంతేగాక, రోడ్డెక్కిన రైతులను పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు సర్కారు.. ద్రవ్యోల్బణం, ఖర్చులు పెరిగాయంటూ పోలవరం నిర్మాణ వ్యయాన్ని రూ.16వేల కోట్ల నుంచి 40వేల కోట్లకు పెంచారని, అలాగే పట్టిసీమ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల కంట్రాక్టర్ల కోసం నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచిందని జగన్ అన్నారు. అయితే రైతులు పండించిన పంటలకు మాత్రం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతులకు ద్రవ్యోల్బణం ఉండదా? అని ప్రశ్నించారు.
ప్రజలకు సంబంధించిన వాటిపై చంద్రబాబుకు ధ్యాసే లేదని అన్నారు. వచ్చీ రానీ ఇంగ్లీషులు ద్రవ్యోల్బణం, ఇన్ ఫ్లేషన్ అంటుంటారని చంద్రబాబును ఎద్దేవా చేశారు. వ్యాపారులకు మేలు చేసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మినుము , పసుపు రైతులు కూడా మద్దతు ధర లభించక దయనీయ పరిస్థిని ఎదుర్కొంటున్నారని అన్నారు.
లోక్యాష్ బాబు అంటున్నారు
తెలుగుదేశం పార్టీ నేతలే చంద్రబాబు కొడుకు లోకేష్ బాబును లోక్యాష్ బాబు అంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో రైతులు బతికే పరిస్థితి కూడా లేదని అన్నారు. మామిడి రైతులకు మద్దతు ధర లభించకున్నా.. చంద్రబాబు హెరిటేజ్ లో మాత్రం రూ.100 కేజీ చొప్పున అమ్ముకుంటున్నారని అన్నారు.
రైతుల కన్నీళ్లు చూసిన ఏ ప్రభుత్వానికి పుట్టగతులుండవని అన్నారు. రైతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. తన దీక్షకు మద్దతుగా వచ్చిన రైతులు, ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications