సిగ్గుండాలి, బుద్ధి, జ్ఞానం రావాలి: బాబుకు జగన్ హెచ్చరిక, కిడ్నీ బాధితులతో భేటీ
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రకాశం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా పీసీపల్లెలో ఆయన శుక్రవారం పర్యటించి.. కిడ్నీ బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ బారిన పడి 484మంది చనిపోయినా చంద్రబాబులో స్పందనలేదని మండిపడ్డారు.
జిల్లాలో 48మండలాల ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు చూసైనా చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం రావాలని అన్నారు. కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యలు వినపడాలని అన్నారు. చంద్రబాబునాయుడు.. కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యలపై స్పందించకుంటే.. పోరాటం మరింత ఉధృతం చేస్తామని జగన్ హెచ్చరించారు.

ఆరోగ్యశ్రీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. కిడ్నీ వ్యాధి బాధితుల కోసం ఈ ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని, వెంటనే రక్షిత నీరు అందించాలని జగన్ డిమాండ్ చేశారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించాలని రాష్ట్రానికి, కేంద్రానికి పది లేఖలు రాశారని చెప్పారు. కనిగిరిలో డయాలసిస్ యూనిట్ కోసం రూ.12లక్షలు అందజేశారని తెలిపారు. ప్రధానిని కూడా ఆయన కలిశారని చెప్పారు.
రూరల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీని కలిసి సమస్యపై వివరించారని చెప్పారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ ప్రపోజల్ను రాష్ట్రానికి పంపితే.. రాష్ట్రం ఏమాత్రం స్పందించలేదని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఒత్తిడి చేస్తేనే ఏ సమస్యపైనైనా పలుకుతాడని అన్నారు. జగన్ ప్రకాశం వస్తున్నాడనే హడావుడిగా ఓ జీవోను జారీ చేశారని అన్నారు. ఇప్పటి వరకు 568కోట్లు మాత్రమే కేటాయించారని, ఇంకా 850 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని అన్నారు.
తాను అధికారంలోకి రాగానే పేదలకు అన్ని రకాల వైద్యాన్ని ఉచితంగా అందజేస్తామని చెప్పారు. పేద ప్రజలు కిడ్నీ వ్యాధితో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మందులు, డయాలసిస్ కోసం ఉన్న ఆస్తులను కూడా అమ్ముకుంటున్నారని చెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వం వెంటనే కిడ్నీ వ్యాధి బాధితులకు అయ్యే మందుల ఖర్చును, డయాలసిస్ ఖర్చులను భరించాలని అన్నారు. అంతేగాక, వారికి జీవనభృతిని అందించాలని అన్నారు. కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రూ.10లక్షల పరిహారం చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications