AP CMO : జగన్ ఆఫీసులో అధికారులకు కొత్త శాఖలు- ఎవరెవరికి ఏమిచ్చారంటే.. !
ఏపీ సీఎంలో ఇవాళ పలు మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా సీఎంవోలో ఉన్న అధికారుల్లో కొందరు బయటికి వెళ్లడంతో వారు అప్పటివరకూ చూస్తున్న శాఖల్ని ఇతరులకు అప్పగించారు. దీంతో ఇప్పటికే సీఎంవోలో ఉన్న పలువురు అధికారులకు కొత్త శాఖలు దక్కాయి. అలాగే మిగతావారి శాఖల్లోనూ మార్పులు జరిగాయి. అసలే మరో 16 నెలల్లో ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం జగన్ సీఎంవోలో తన టీమ్ లో మార్పులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎంవోలో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు కొత్త శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సీఎంవోలో ఉన్న జవహర్ రెడ్డి,ఆరోఖ్య రాజ్ అక్కడి నుంచి బయటికి వెళ్లడంతో కొత్తగా కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ విడుదలైన ఉత్తర్వుల ప్రకారం సీనియర్ ఐఏఎస్ లు పూనం మాలకొండయ్య కు 10 శాఖలు,ధనుంజయ రెడ్డికి 7 శాఖలు,ముత్యాలరాజు కి 7 శాఖలు,నారాయణ్ భరత్ గుప్తాకు 6 శాఖలు కేటాయించారు.
సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్యకు సాధారణ పరిపాలన శాఖతో పాటు విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వ్యవసాయం సంబంధిత శాఖలు, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడులు, ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, మార్కెటింగ్,సహకారం, మహిళా,శిశుసంక్షేమం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం బాధ్యతలు అప్పగించారు.
సీఎం కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డికి ఆర్ధిక, ప్రణాళిక, హోం, జలవనరులు, పురపాలక, విద్యుత్, పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక, గనులు, జియాలజీ శాఖలు కేటాయించారు. అలాగే సీఎం అదనపు కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజుకు రెవెన్యూ, న్యాయ, కార్యనిర్వాహక, భూములు, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, సర్వే, సీఎంఆర్ఎఫ్, విపత్తుల నిర్వహణ, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ శాఖలు కేటాయించారు. సీఎం సంయుక్త కార్యదర్శిగా ఉన్న నారాయణ భరత్ గుప్తాకు హౌసింగ్, పంచాయతీరాజ్, సచివాలయాలు, ఐటీ, సంక్షేమశాఖలు, సీఎం ఇచ్చే హామీలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే వినతుల వ్యవహారాల్ని అప్పగించారు.