ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే వైసీపీ మద్దతు: జగన్ ఢిల్లీ పర్యటన రద్దు, కేబినెట్ భేటీ యథాతథం
అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్మూకే మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది.
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా గిరిజన(ఎస్టీ) మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని వైసీపీ పేర్కొంది. గడిచిన మూడేళ్లుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్దపీట వేస్తున్న పార్టీగా ద్రౌపదీ ముర్మూకే మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంది.
శుక్రవారం ఏపీ మంత్రివర్గం సమావేశం ఉన్నందున శుక్రవారం జరగబోయే ద్రౌపదీ ముర్మూ నామినేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరు కావడం లేదని, తమ పార్లమెంటరీ పార్టీ నేత, లోక్సభాపక్ష నేత హాజరవుతారని ఓ ప్రకటనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీంతో శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ భేటీ యథాతథంగా జరగనుంది.
కాగా, రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల తరపున సీనియర్ రాజకీయ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైతే ఏ అభ్యర్థికి కూడా అధికారికంగా మద్దతు ప్రకటించలేదు.