సజ్జల పై జగన్ కీలక నిర్ణయం - ఆ నేతకు పిలుపు..!!
ఏపీ ప్రజలు జగన్ పాలనను తిరస్కరించారు. ఓటమికి కారణాలు ఏవైనా...ప్రజలు మాత్రం జగన్ కు వ్యతిరేకంగా మెజార్టీ ఓటేసారు. ఈ నెల 12న చంద్రబాబు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్రంలోనూ టీడీపీ కీలకంగా మారుతోంది. ఇటు వైసీపీ నేతల్లో జగన్ కోటరీ పైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఓటమి వెనుక వారి వ్యవహార శైలి కారణమని మండిపడుతున్నారు. దీంతో, జగన తన పార్టీలో ప్రక్షాళనకు సిద్దమయ్యారు. కీలక పదవుల్లో మార్పులు ఖాయమని తెలుస్తోంది.
జగన్ అడుగులు
వైసీపీలో కీలక మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. పార్టీకి ఊహించని ఓటమితో షాక్ కు గురయ్యారు. ఫలితాల పైన ఉద్వేగంతో స్పందించారు. తాను చేసిన మంచి ఏమైందని ప్రశ్నించారు. అయినా తమకు ప్రతిపక్షం కొత్త కాదని చెప్పారు. వాయిస్ లేని వారికి వాయిస్ గా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల తరపున నిలబడతామని స్పష్టం చేసారు. ఇక..వైసీపీ ఎమ్మెల్యేలు ఓటమి తరువాత భిన్నంగా స్పందిస్తున్నారు. జగన్ నాయకత్వం..నిర్ణయాలను ప్రశ్నించటం లేదు. కానీ, జగన్ సలహాదారులు...సీఎంఓ అధికారుల ఏ విధంగా వ్యవహరించారో బయట పెడుతున్నారు.

సజ్జలపై నిర్ణయం
జగన్ కు కుడిభుజం గా వ్యవహరించిన సజ్జల తీరు పైన పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారే మండిపడుతున్నారు. సజ్జల అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించారని..ఉద్యోగులతో ఆయన చర్చలు చేసిన విధానం సరిగ్గా లేకపోవటమే భారీ వ్యతిరేకతకు కారణమైందనే అభిప్రాయం వినిపిస్తోంది. అదే విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తరువాత అసలు ఆ ఓటర్లు తమ పార్టీకి చెందిన వారు కాదని చేసిన వ్యాఖ్యలు పార్టీ ముఖ్యులకు రుచించ లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు విలువ లేకుండా జగన్ కంటే తానేం తక్కువ కాదన్నట్లుగా వారితో వ్యవహరించారని..సజ్జల కారణంగా గ్యాప్ పెరిగిందంటూ పార్టీ కేడర్ సోషల్ మీడియాలో పోస్టులు సంచలనంగా మారాయి.
పార్టీ కేడర్ తో సమీక్షలు
అదే విధంగా జగన బాగా నమ్మిన అధికారి ధనుంజయ రెడ్డి తీరు పైన ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు. దీంతో..తాజాగా పార్టీ నేతలతో జగన్ మాట్లాడారు. అందరూ కేడర్ కు మద్దతుగా నిలవాలని సూచించారు. పార్టీ కార్యాయం మార్పు పైన నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేసారు. అదే సమయంలో సజ్జల విషయంలోనూ జగన్ ఆలోచన మారినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సజ్జలకు ఇతర బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. విజయ సాయిరెడ్డిని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ చేస్తూ..జిల్లాల వారీగా సమీక్షలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో జగన్ తన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications