ఇక ప్రజల్లోనే.. పాదయాత్ర ప్రకటించిన జగన్ - పార్టీలో చేరికలు, వైసీపీ ప్లీనరీ..!!
మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేసారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కార్యాచరణ పైన కసరత్తు కొనసాగుతోంది. పార్టీ నేతలతో జగన్ ఇక నుంచి తనలో పూర్తి మార్పు చూస్తారని స్పష్టం చేసారు. చంద్రబాబు పాలన చూసిన తరువాత తాను మారక తప్పని పరిస్థితి ఏర్పడిందని జగన్ వ్యాఖ్యానించారు. తన కోసం మద్దతుగా నిలిచిన వారికి వేధిస్తున్నారని..వారి కోసం తాను అండగా నిలబడతానని జగన్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహిద్దా మని జగన్ చెప్పుకొచ్చారు. 2019 నాటి పరిస్థితులు రాష్ట్రంలో రిపీట్ అవుతున్నాయని చెప్పిన జగన్ తన పాదయాత్ర పైన స్పష్టత ఇచ్చారు.
2027 లో పాదయాత్ర
పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. కూటమి పాలన పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గురించి వివరించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం గురించి స్పష్టత ఇచ్చారు. పార్టీ నిర్మాణం పూర్తి చేస్తూ నే ఇక.. జనంలోనే ఉండేలా కార్యాచరణ ఖరారు చేస్తామని జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేసారు. 2029 లో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడు తున్నారని ఫైర్ అయ్యారు. కేసులకు భయపడితే రాజకీ యాలు చేయలేమన్నారు. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద మనం ప్రధానంగా ధ్యాస పెట్టామని వివరించారు. 2027 నుంచి పాదయాత్ర 2.0 ప్రారంభిస్తానని ప్రకటించారు. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలన్నారు. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలని జగన్ సూచించారు.

2019 రిపీట్
ప్రతి ఇంటికి పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్ధితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ చెప్పుకొచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతుభరోసా కనిపించడం లేదు. ప్రతి పథకం కనపడకుండా పోతోందని పేర్కొన్నారు. విచ్చల విడిగా అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. రూపాయికే రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణ మైన స్థాయికి తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. కేడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారని జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
ప్రాధాన్యతలు మారాలి
చంద్రబాబు హయాంలో ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత మనం కూడా మన ప్రయారీటీస్కు అనుగుణంగా కచ్చితంగా పని చేయాలన్నారు. చంద్రబాబు పాలన చూసిన తరువాత తనలోనూ మార్పు వచ్చిందని జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ 2.0 ఖచ్చితంగా వేరే విధంగా ఉంటుం దని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో కేడర్ కు చేయాల్సినంతగా చేయలేదని చెప్పిన జగన్.. వారు తనకు అండగా నిలుస్తున్నారనే కారణంతోనే వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. వారి కోసం అండగా నిలవాల్సిన బాధ్యత తన పైన ఉందన్నారు. ఇక, జగన్ సమక్షంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన మాజీ నేతలు వైసీపీలో చేరారు. ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తో పాటుగా పలువురిని పార్టీ కండువా కప్పి జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తామ ని నేతలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications