రఘురామ ట్రాప్ లో జగన్ ? అంతా ఊహించినట్లే- అదే జరిగితే భారీ సక్సెస్
వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరు క్లైమాక్స్ కు చేరబోతోంది. రెబెల్ ఎంపీపై అనర్హత వేటు కోసం వైసీపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పెండింగ్ లో పెట్టారు. దీంతో స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ తీసుకున్న ఓ నిర్ణయం అంతిమంగా రఘురామరాజుకే మేలు చేయబోతోంది. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు కోసం తాను చేస్తున్న పోరాటం, దానికి వైసీపీ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను జాతీయస్ధాయిలో ఎంపీలు, గవర్నర్లు, సీఎంల దృష్టికి తీసుకెళ్లిన రఘురామ.. ఈ మలి పోరులోనూ విజయవంతమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.

తుది అంకానికి జగన్, రఘురామ పోరు
తానిచ్చిన టికెట్ తో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఏడాదిన్నర క్రితం తనపై ప్రారంభించిన పోరాటం విజయవంతంగా కొనసాగుతుండటంతో ఏం చేయాలో తెలియక సీఎం జగన్ దిక్కులు చూడాల్సిన పరిస్దితులు నెలకొంటున్నాయి. రఘురామరాజుపై తాము పెట్టిన సీఐడీ కేసు తర్వాత ఆయన రూటు మార్చడంతో ఇప్పుడు ఆయనపై చర్యల మాట అటుంచి, కనీసం నిలువరించడం కూడా కష్టంగా మారిపోతోంది. దీంతో రఘురామ వర్సెస్ జగన్ గా సాగుతున్న పోరు మలి అంకానికి చేరుకున్నట్లయింది. ఈసారి రఘురామపై తాము ప్రయోగిస్తున్న బుల్లెట్ మిస్ ఫైర్ అయితే మాత్రం జగన్ కష్టాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

రెబెల్ ఎంపీపై పోరుకు 27 మంది ఎంపీలు
రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు కోసం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసిన వైసీపీ ఎంపీలు.. ఆయన నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఇక ముఖాముఖీ పోరుకు సిద్దమయ్యారు. రఘురామతో పాటు లోక్ సభ స్పీకర్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంటులో నిరసనలకు సిద్దమవుతున్నారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలంతా కలిసి రఘురామపై అనర్హత వేటు కోరుతూ నిరసనలకు దిగబోతున్నారు. ఈ విషయాన్ని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తాజాగా వెల్లడించారు. దీంతో వైసీపీ చేస్తున్న పోరు పతాకస్ధాయికి చేరబోతోంది. అయితే వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంపైనా రఘురామ కౌంటర్ పోరాటం మొదలుపెట్టేశారు. దీంతో వైసీపీకి ఊపిరాడని పరిస్ధితి.

రఘురామ ట్రాప్ లోకి జారుకున్న జగన్
తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ, రాజకీయాల్లో నిక్కచ్చిగా మాట్లాడతాడని పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్, రఘురామ పోరుపై మాట్లాడుతూ ఈ పోరుకు క్లైమాక్స్ ఏంటో తేల్చిచెప్పేశారు. కేవలం ఓ ఎంపీ అయిన రఘురామతో ఇంత భారీ మెజారిటీ, ప్రజా మద్దతు కలిసిన జగన్ పోరు ఆయనకే నష్టమని స్పష్టం చేశారు. ఏడాదిన్నర క్రితం జగన్ సర్కార్ పై కేవలం రెండు విమర్శలతో ప్రారంభమైన రఘురామ పోరు.. ఇప్పుడు సై అంటే సై అనే స్ధాయికి చేరడాన్ని బట్టి చూస్తే రెబెల్ ఎంపీ పకడ్బందీగా విసురుతున్న వలలో జగన్ చిక్కుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video

రఘురామ ఖాతాలో మరో సక్సెస్
జగన్ వర్సెస్ రఘురామగా సాగుతున్న పోరాటంలో ఇప్పటికే పలుమార్లు పైచేయి సాధించిన ఈ వైసీపీ రెబెల్ ఎంపీ ఇప్పుడు మరో విజయాన్ని తన ఖాతాలోకి వేసుకునేందుకు సిద్దమవుతున్నారు. పార్లమెంటులో రఘురామరాజుపై వేటు కోసంవైసీపీ ఎంపీలంతా కలిసి నిరసనకు దిగితే సహజంగానే ఇతర ఎంపీల దృష్టంతా వీరిపై పడుతుంది. అంతకు మించి వీరంతా కలిసి పోరాడుతున్న రఘురామరాజుపై పడుతుంది. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు కోరుతున్న రెబెల్ ఎంపిగా జాతీయ స్ధాయిలో పేరు తెచ్చుకున్న రఘురామరాజు.. ఇప్పుడు పార్లమెంటులో వైసీపీ తనను టార్గెట్ చేస్తున్న విషయాన్ని పార్లమెంటు వేదికగా దేశం మొత్తానికి చూపేందుకు వీలు కలుగుతుంది. అప్పుడు వైసీపీకి రాజకీయంగా తీవ్ర నష్టం తప్పదన్న అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications