8 నెలల చంద్రబాబు సర్కార్ వైఫల్యాలే ప్రధానాస్త్రంగా..
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.
జగన్ 2.0 అంటూ ఇటీవలే ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్.. వైఎస్ఆర్సీపీలో చేరడం మరింత ఊపునిచ్చినట్టయింది. కాంగ్రెస్కు చెందిన మరికొందరు సీనియర్లు వైసీపీ కండువా కప్పుకొంటారనే ప్రచారం సైతం జరుగుతోంది.

ఈ పరిస్థితుల మధ్య జగన్ మరోసారి సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారుు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని గుర్తు చేశారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లో మరింత ఎండగట్టాలంటూ పిలుపునిచ్చారు.
మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఫలితంగా- ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రతరమౌతోందని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం అంతా సమష్టిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ మోసాలను ప్రజల్లో ఎండ గట్టాలని సూచించారు. సూపర్ 6 హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా- ఏవేవో కుంటి సాకులు చెబుతూ.. వాటిని ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తోన్నారని అన్నారు జగన్.
వీటన్నింటినీ జనంలోకి తీసుకెళ్లాలని, చంద్రబాబు వంచన, దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజలకు వివరించాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని జగన్ సూచించారు. తమ ఎనిమిది నెలల పాలనలో చోటు చేసుకున్న వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం వల్ల కలుగుతోన్న నష్టం గురించి చెప్పాలని కోరారు.
సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎస్వీ మోహన్రెడ్డి, కైలే అనిల్కుమార్, కావటి మనోహర్నాయుడు, సురేష్బాబు, గోరంట్ల మాధవ్, ఈపూరు గణేష్, ఆలూరు సాంబశివారెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వంకా రవీంద్రనాథ్, అదీప్రాజు, పేర్నికిట్టు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications