మోడీ-అమిత్ షా ముందు జగన్ కీలక డిమాండ్లు-కీలక బిల్లులపై అండగా ఉంటామని హామీ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సీఎం జగన్.. వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ మరోసారి కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన సమస్యలతో పాటు నిధుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు.
ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లిన సీఎం జగన్ ముందుగా హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి హోంశాఖ పరిధిలో ఉన్న అంశాలతో ఆయనతో చర్చించారు. అలాగే ఇతర శాఖల మంత్రులతో భేటీకి అపాయింట్ మెంట్లు ఇప్పించాలని కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఏపీ పెండింగ్ అంశాలపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరినట్లు తెలుస్తోంది.

అనంతరం ప్రధాని మోడీతో సీఎం జగన్ దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఇందులో పోలవరంతో పాటు మిగిలిన పెండింగ్ అంశాలపై గతంలో ఇచ్చిన విజ్ఞాపనల పురోగతిపైనా చర్చించారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై ఎన్నికల ఏడాది కాబట్టి త్వరగా నిర్ణయాలు తీసుకునేలా చూడాలని అడిగినట్లు సమాచారం. దీనిపై ప్రధాని కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మరోవైపు కేంద్రం త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కామన్ సివిల్ కోడ్ బిల్లుతో పాటు ఢిల్లీ అధికారులపై కేంద్రానికి అధికారం కట్టబెట్టే బిల్లుకూ వైసీపీ మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ కోరినట్లు తెలుస్తోంది. దీనికి సీఎం జగన్ కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కేంద్రానికి కీలకమైన పలు బిల్లులపై ఇప్పటికే అండగా ఉంటున్న జగన్.. మరోసారి అదే తరహాలో అండగా ఉంటామని ప్రధానికి తెలిపారు.












Click it and Unblock the Notifications