నిధులు కేటాయించండి: రైల్వే మంత్రితో జగన్ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్లను కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేసినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా వైయస్ జగన్ బృందం సోమవారం సురేష్ ప్రభుతో సమావేశమయ్యింది.
ఈ సమావేశంలో వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్లమెంటుసభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక, పొంగులేటి శ్రీనివాస్, వరప్రసాద్లు పాల్గొన్నారు. అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి కొత్త రైల్వే జోన్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.
ఇరు రాష్ట్రాల్లోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. నిధులు లేక ప్రాజెక్టులు ఆగిపోయిన విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించామన్నారు. వాటికి వెంటనే నిధులు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలిపినట్లు జగన్ తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో తెలుగు రష్ట్రాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమ వినతులకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు సానుకూలంగా స్పందించారని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్లను కలిసిన విషయం తెలిసిందే.