చంద్రబాబుకు తోలుమందం.. కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో వైఫల్యం: జగన్
పేదలకు సంజీవని లాంటి 108వాహనాలను మూలన పడేశారని ఆరోపించారు. 108కి ఫోన్ చేస్తే.. వాహనంలో డీజిల్ లేదనే సమాధానాలు వస్తున్నాయని గుర్తుచేశారు.
జగతి: ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉద్దానం కిడ్నీ బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ బాధితుల సమస్యల గురించి స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వారి పట్ల ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ప్రశ్నించారు. కిడ్నీ బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిసేలా.. ఆరోగ్యశ్రీ, 108,104సేవలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు తోలుమందమని, అందరం ఏకమై ఆయనపై ఒత్తిడి తీసుకొద్దామని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదలకు సంజీవని లాంటి 108వాహనాలను మూలన పడేశారని ఆరోపించారు. 108కి ఫోన్ చేస్తే.. వాహనంలో డీజిల్ లేదనే సమాధానాలు వస్తున్నాయని గుర్తుచేశారు. 104పరిస్థితి కూడా అలాగే తయారైందన్నారు. గతంలో కిడ్నీ పేషెంట్లకు గానీ, మూగ చెవిటి పిల్లలకు గానీ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేసేవారని, చంద్రబాబు సర్కార్ వాటిని ఎత్తివేసిందన్నారు.
కిడ్నీ వ్యాధి బారిన పడినవాళ్లలో మొదట మందులు ఇస్తారని, ఆ తర్వాత బ్లడ్ లెవల్ మెయింటెనెన్స్ కోసం వారం లేదా రెండు రోజులకు ఒకసారి ఇంజక్షన్ ఇస్తారని పేర్కొన్నారు. ఒక్కో ఇంజక్షన్ ఖర్చు రూ.650వరకు అవుతుందన్నారు. మందులకు రూ.2వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చవుతుందన్నారు.
అప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గకపోతే డయాలసిస్ లో వెళ్తారని, దీనికి నెలకు రూ.20వేల దాకా ఖర్చవుతుందని అన్నారు. చివరి స్టేజీలో అయితే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రూ.10లక్షల ఖర్చవుతాయన్నారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications