'కొత్త పెళ్లి కూతురు కోసం బాబు.., పెద్దమనిషి ఎండలు తగ్గించాలని ఆదేశాలిస్తున్నాడు?'
అమరావతి: బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్న తర్వాత చంద్రబాబు కొత్త పెళ్లికూతురు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. తిరుపతిలో ధర్మపోరాట దీక్ష పెట్టి పెట్టి స్వాతంత్య్రం కోసం పోరాడింది తెలుగుదేశం పార్టీ అని చెబుతున్నాడని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో ఇదే పెద్దమనిషి కానీ ఉండి ఉంటే ప్యాకేజీ తీసుకుని బ్రిటీష్ వారితో లాలూచీ పడేవాడని విమర్శించారు.

ఎండలు తగ్గించాలని ఆదేశాలు:
ప్రతీది తన క్రెడిటే అని చెప్పుకునే యావ చంద్రబాబులో ఎక్కువైందన్నారు జగన్. 'సత్య నాదేళ్ల కష్టపడి బాగా చదువుకుని మైక్రోసాఫ్ట్ సీఈవో స్థానానికి చేరుకుంటే.. అదీ నా ఘనతే అన్నాడు. పాపం ఆ సింధు కష్టపడి ఆడి ఆడి ఈ స్థాయికి వచ్చింది. సింధుకు షటిల్ ఆడటం తానే నేర్పించానంటాడు. నిన్ననో.. మొన్ననో.. ఎండలు 10డిగ్రీలు తగ్గించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాడు. అంటే, సూర్యుడికి ఫోన్ చేసి పది డిగ్రీలు తగ్గించాలని చెప్పాలేమో!' అని జగన్ చంద్రబాబును విమర్శించారు.

విచ్చలవిడి అవినీతి:
రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్నారు జగన్. పైన చంద్రబాబు.. కింద స్థాయిలో జన్మభూమి కమిటీలు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. 'పైన చంద్రబాబు మట్టి, ఇసుక, మద్యం, బొగ్గు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, గుడి భూములు చివరకు గుడిలోని ఆభరణాలనూ వదలిపెట్టడం లేదు.. కింద గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలతో ఓ మాఫియాను తయారుచేశారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆక్వా పరిస్థితి దారుణం:
ఉంగుటూరు నియోజకవర్గంలో ఆక్వా రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని జగన్ అన్నారు. రోజురోజుకు ధరలు తగ్గిపోతున్నాయని, వ్యాపారులే దళారులై ధరలు తగ్గిస్తున్నారని రైతులు తనతో మొరపెట్టుకున్నట్టు జగన్ తెలిపారు. చేప పిల్లలను ఉత్పత్తి చేసే హేచరీస్ మొదలు దాణా వరకు, చేప పిల్లలు మొదలు మార్కెటింగ్ వరకు అన్ని దళారీ వ్యవస్థలే అన్నారు. ప్రైవేట్ ల్యాబ్స్తో వ్యాపారులు కుమ్మక్కై తమను మోసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు.

నేను పరిష్కరిస్తా..:
కొల్లేరు సమస్య ప్రస్తుతం సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నదని, దీనిపై చిత్తశుద్దితో పనిచేయాల్సిన అవసరం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ సమస్యపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి నాపక్కన కూర్చోబెట్టుకుంటానని హామి ఇచ్చారు. సీఎం కార్యాలయంతో, సీఎంతో నేరుగా టచ్లో ఉండి కొల్లేరు సమస్య పరిష్కారానికి ఏమేం చేయాలో అంతా చేస్తామని భరోసా ఇచ్చారు. 1999లొ చంద్రబాబు సరిగా సర్వే చేయించకపోవడం వల్లే అనేక గ్రామాలు నష్టపోతున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications