దౌర్జన్యం: బాబుపై జగన్, బాంబులు పెట్టి చంపేశారని..
కృష్ణా: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దౌర్జాన్యాలకు పాల్పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కలలో ప్రత్యర్థుల దాడిలో హత్యకు గురైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావు కుటుంబాన్ని జగన్ బుధవారం పరామర్శించారు. తమ కుటుంబానికి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ నేత కృష్ణారావును హత్య చేయడం దారుణమన్నారు. ఓటు వేయలేదనే కారణంతో ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి హత్య చేశారని అన్నారు.
కృష్ణారావును చంపవద్దని కుటుంబసభ్యులు ప్రాధేయపడ్డా హంతకులు కనికరం లేకుండా హత్య చేయడం అమానుషమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలపై ఇంత దారుణాలు జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో తెలుగుదేశం పార్టీ గుండాలు మందుగుండు సామాగ్రి పేలుస్తుంటే.. పిల్లలు భయపడతారని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి తల మీద బాంబు పెట్టి పేల్చి చంపేశారని అన్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు మానవత్వం ఏమైనా ఉందా అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ప్రోత్సహించడం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం మంచిది కాదని వైయస్ జగన్.. చంద్రబాబుకు హితవు పలికారు.