కుట్ర కోణం, ఆ నేతలే కారణం: ఏర్పేడు ప్రమాదంపై వైయస్ జగన్ ఫైర్
ఏర్పేడు ప్రమాద ఘటనకు ప్రభుత్వం కూడా కారణమంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇసుక మాఫియా ఒక పథకం ప్రకారమే మునగలపాళెంవాసుల హత్యకు తెగబడిందని
శ్రీకాళహస్తి: ఏర్పేడు ప్రమాద ఘటనకు ప్రభుత్వం కూడా కారణమంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇసుక మాఫియా ఒక పథకం ప్రకారమే మునగలపాళెంవాసుల హత్యకు తెగబడిందని ఆరోపించారు. 'ఏర్పేడు' మృతుల కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.
మొదట మునగలపాళెంలో బాధితులను కలిసి ఓదార్చారు. ఈ సంఘటన వెనుక కుట్రకోణం దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులు కూడా ఇదే విషయాన్ని తనకు చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎనిమిది ప్రాంతాల నుంచి ఇసుక పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్నారని, జిల్లావ్యాప్తంగా వంద చోట్లకు పైగా ఇసుక అక్రమ రవాణా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
ఈ విషయం అధికార యంత్రాంగానికి తెలిసే జరుగుతోందన్నారు. అధికార పార్టీ నేతలు
మాఫియాగా ఏర్పడి ఇసుక వ్యాపారం చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు మొదలుకుని ముఖ్యమంత్రి వరకు ఇసుక మామూళ్లు పోతున్నాయని ఆరోపించారు.
ఏర్పేడు మండలం గోవిందవరానికి చెందిన మాజీ జడ్పీటీసీ ధనుంజయనాయుడు, చిరంజీవులునాయుడు, మణినాయుడు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏర్పేడు ఘటనకు వారే బాధ్యులన్నారు. కాగా, జగన్ వెంట ఎంపీ మిథునరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, సునీల్ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications