జగనా ? చంద్రబాబా ? తేల్చుకోలేకపోతున్న బీజేపీ-పొత్తులపై నడ్డా వ్యాఖ్యల వెనుక?
ఏపీలో 2019 ఎన్నికల్లో ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయిన బీజేపీ.. 2024 ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే రాష్ట్రంలో పరిస్ధితులు అందుకు సహకరించడం లేదు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉందని అంచనా వేసుకుని దూకుడు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన బీజేపీ...ఈసారి వైసీపీతో పరోక్షంగా సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలా లేక టీడీపీతో కలిసి ముందుకు సాగాలా అన్న దానిపై తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది.

పొత్తు రాజకీయాలు
ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో పొత్తు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తుపై రాష్ట్రంలో తీవ్ర చర్చలు జరుగుతుండగా.. బీజేపీ కూడా పొత్తులపై ఆసక్తి చూపుతోంది. అయితే ఇఫ్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. తుదికంటా ఈ పొత్తు కొనసాగిస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో జనసేన కూడా బీజేపీని వీడి టీడీపీతో జత కట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. వీలైతే టీడీపీ-బీజేపీతో కలిసి వెళ్లాలని, కుదరకపోతే కనీసం టీడీపీతో కలిసి వెళ్లాలని జనసేన భావిస్తోంది.

సీఎం సీటుకు బీజేపీపై జనసేన ఒత్తిడి
ఒక వేళ బీజేపీ-జనసేన పొత్తు కొనసాగినట్లయితే పవన్ కళ్యాణ్ నే సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. అదే సమయంలో తమతో పొత్తు పెట్టుకునే వారు పవన్ నే సీఎం చేయాలంటూ టీడీపీకి కూడా జనసేన ఆప్షన్లు ఇస్తోంది. దీంతో టీడీపీ, బీజేపీ ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. వీరిలో ప్రధానంగా జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ ఆలోచనలో పడుతోంది. అయినా పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించేందుకు బీజేపీ ముందుకు రావడంలేదు. దీని వెనుక చాలా కారణాలున్నాయి.

నడ్డా కామెంట్స్ వెనుక?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా ఏపీలో పర్యటించారు. ఈ టూర్ లో ఆయన బీజేపీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన పలు సూచనలు చేశారు. వీటిలో ముఖ్యంగా రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నేతలకు సూచించారు. ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నందున.. మరో పొత్తుకు సంబంధించి నేతలు చేసే వ్యాఖ్యలతో గందరగోళం పెరుగుతుందనేది జేపీ నడ్డా వాదన. దీంతో ప్రస్తుతానికి జనసేనతో పొత్తు కొనసాగుతుందని మాత్రమే బీజేపీ నేతలు చెప్తున్నారు.

జగనా , చంద్రబాబా తేల్చుకోలేక?
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితుల్లో అధికార వైసీపీవైపు ప్రజల మొగ్గు ఉందా లేక విపక్ష టీడీపీవైపు ఉందా అనే విషయంలో బీజేపీ ఓ అంచనాకు రాలేకపోతోంది. దీంతో ప్రజల అభీష్ణానికి వ్యతిరేకంగా తాము పొత్తులు పెట్టుకుంటే భవిష్యత్తులో మరోసారి ఎదురుదెబ్బలు తప్పవని కాషాయ పార్టీ భావిస్తోంది. కాబట్టి వైసీపీపై ప్రజా వ్యతిరేకతను అంచనా వేసుకుంటూనే మరోసారి ఆ పార్టీ అధికారంలో వస్తుందని భావిస్తే ఓ వ్యూహం, లేక టీడీపీ గెలిచే అవకాశం ఉందని తేలితో మరో వ్యూహంతో ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అంతవరకూ మౌనంగా ఉండాలని పార్టీ నేతలకు జేపీ నడ్డా సూచించారు.












Click it and Unblock the Notifications