హైదరాబాద్కు జగన్: కడప విశ్రాంతి భవన్లో బిజీబిజీ
హైదరాబాద్: సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి హైదరాబాదు చేరుకున్నారు. మంగళవారం వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో హైదరాబాదుకు వచ్చారు. బుధవారం ఉదయం హైదరాబాదులో దిగారు. ఈ సమయంలో రైల్వే స్టేషన్ జై జగన్ నినాదాలతో హోరెత్తింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఇడుపులపాయలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. జగన్ సుదీర్ఘ కాలం తర్వాత రావడంతో ఇడుపులపాయ జనసంద్రమైంది. వైయస్ఆర్ ఘాట్కు చేరుకున్న జగన్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సతీమణి భారతి, బాబాయ్ వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులతో కలిసి నివాళులు అర్పించారు.

ఇడుపులపాయకు వెళ్లేందుకు కోర్టు ఒక్కరోజు అనుమతి ఇవ్వడంతో మంగళవారం ఉదయం 6 గంటలకు జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. ఉదయమే అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలతో కరచాలనం చేసి మాట్లాడారు. 9 గంటల ప్రాంతంలో విశ్రాంతి భవనం నుంచి నేరుగా వైయస్సార్ ఘాట్కు చేరుకున్నారు. దారిపొడవునా అభిమానులు జగన్తో చేతులు కలిపేందుకు పలకరించేందుకు ఎగబడడంతో ఘాట్కు చేరుకునేందుకు 15 నిముషాల దాకా పట్టింది.
ప్రార్థనల అనంతరం నేరుగా ఉదయం 10 గంటలకు విశ్రాంతి భవనం చేరుకుని తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చించారు. అభిమానులు బయటకు రావాలని నినాదాలు చేయడంతో జగన్ బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. సాయంత్రం వరకు కొంతసేపు లోపలున్న నాయకులతో మాట్లాడడం, మరికొంతసేపు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం, పలుకరింపులు చేస్తూ జగన్ బిజీబిజీగా గడిపారు.












Click it and Unblock the Notifications