జగన్ షరతు సడలింపు పిటిషన్ పైన టైం కోరిన సిబిఐ
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సిన బాధ్యత తన పైన ఉందని, అందుకే తనకు బెయిల్ షరతులని సడలించాలని కోరుతూ వైయస్ జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాదు విడిచి వెళ్లరాదనే షరతును సడలించాలని ఆయన పిటిషన్లో కోరారు. న్యూఢిల్లీకి వెళ్లేందుకు, ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు తనకు అనుమతివ్వాలని కోరారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల మనోభావాలను, వారి కష్టనష్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు.
తాను ఓదార్పు యాత్రను కూడా కొనసాగించాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను కలిసి వారి మనోభావాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంపిగా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన పైన ఉందన్నారు. ఎంపీగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
విజయ సాయికి సిబిఐ అనుమతి
మరోవైపు తనకు బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న విజయ సాయి రెడ్డి పిటిషన్ విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. విజయ సాయి చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లేందుకు తమకు అభ్యంతరం లేదని కోర్టుకు సిబిఐ తెలిపింది.