పోగొట్టుకున్న చోటే వెతుక్కోనున్న జగన్-సంక్రాంతి తర్వాత ఈ రెండు ప్లాన్స్..!
ఏపీలో 2019 ఎన్నికల్లో అసాధారణ గెలుపు తర్వాత గత ఐదేళ్ల పాటు దుర్భేద్యంగా కనిపించిన వైసీపీ.. గత ఎన్నికల్లో మాత్రం దారుణంగా పతనమైంది. ఓ దశలో 156 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్న వైసీపీ కాస్తా గత ఎన్నికల తర్వాత 11 ఎమ్మెల్యేలకు చేరింది. దీంతో లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకోవడంతో పాటు దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంబించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ త్వరలో మరో అడుగు వేయబోతున్నారు.
గతంలో పార్టీ పెట్టాక పదేళ్ల పాటు జనంలోనే ఉంటూ 2019లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న జగన్.. తిరిగి మూలాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందు కోసం సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్దమవుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ రెండు రోజుల పాటు ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 రోజులపాటు సమీక్షలు ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇలా 26 జిల్లాల్లోనూ జగన్ పర్యటనలు ఉంటాయి.

జనవరి మూడో వారం తర్వాత జనంలోకి వెళ్లబోతున్న జగన్.. పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. మరోవైపు ఇకపై తాడేపల్లిలో తనను కలిసేందుకు వచ్చిన వారిని తప్పనిసరిగా కలిసేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా తనను అపాయింట్మెంట్ తో పనిలేకుండా కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే జనానికి చేరువయ్యారు. కానీ జగన్ మాత్రం అధికారంలోకి వచ్చాక ప్రజాదర్బార్ నిర్వహించాలని భావించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications