టార్గెట్ బాబు: బాలకృష్ణ వియ్యంకుడ్ని, గల్లా జయదేవ్ను లాగిన జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు భూపందేరం చేస్తున్నారని చెబుతూ బాలకృష్ణ వియ్యంకుడిని, గల్లా అరుణ కుమారిని లాగారు.
చంద్రబాబు అప్పనంగా తన వారికి భూములు అప్పగిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలకృష్ణ వియ్యంకుడికి కృష్ణానది ఒడ్డున జగ్గయ్యపేట వద్ద ఎకరాకు రూ.లక్షకు ఇచ్చారని చెప్పారు. అక్కడ ఎకరం ధర రూ.50 లక్షలు పలుకుతోందన్నారు.
అయితే, అంత తక్కువ ధరకు బాలయ్య వియ్యంకుడికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తే... 2013లోనే దరఖాస్తు చేసుకున్నారని చెబుతారని ఎద్దేవా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి అదే ధరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంత తక్కువ ధరకు ఇచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి భయపడ్డారన్నారు.
కానీ చంద్రబాబు వచ్చాక రూ.250 కోట్ల దాదాపు అయిదు వందల ఎకరాల భూమిని రూ.4.95 కోట్లకు అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. మరోచోట గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ కంపెనీకి దాదాపు 22 ఎకరాల భూమి చంద్రబాబు ఇచ్చారన్నారు.
అక్కడ ఎకరా రూ.2 కోట్ల నుంచి ఆ పైన పలుకుతోందని, కానీ ఎకరా రూ.22.50 లక్షలకు ఇచ్చారని ఆరోపించారు. అదేమంటే 2009లోనే దరఖాస్తు ఉందని చెబుతారని, కానీ అంత తక్కువ ధరకు నాటి ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదన్నారు. అప్పుడు కూడా నాటి సీఎం భయపడ్డారన్నారు.
కానీ నేడు చంద్రబాబు.. అప్పటి ముఖ్యమంత్రుల పేర్లు చెప్పి ఇప్పుడు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక విశాఖలోని మధురవాడలో ఎకరా భూమి రూ.7.25 కోట్ల నుంచి రూ.10 కోట్లు చేస్తుందని, అలాంటి భూమిని ఏపీఐఐసీకి రూ.50 లక్షలకే ట్రాన్సుఫర్ చేశారన్నారు. మార్కెట్ ధర రూ.7.25 కోట్లు అని చెబుతున్నారన్నారు.
ఈ భూమి ఆ తర్వాత ఏపీఐఐసీ నుంచి చంద్రబాబుకు సంబంధించిన బినామీల చేతుల్లోకి అదే రూ.50 లక్షలకు వెళ్లిపోతుందని ఆరోపించారు. ఇంత తక్కువ ధరకు ఇచ్చారేమిటని ప్రశ్నిస్తే అదే మార్కెట్ ధర అంటారని ఆరోపించారు. కోట్లాది రూపాయల భూములు దోచేస్తున్నారని మండిపడ్డారు.
అలాగే, శ్రీకాకుళం జిల్లాలో తన తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం, కాకినాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు లీజుకు అంటూ భూములు కట్టబెట్టారని అరోపించారు. సీఆర్డీఏ పరిధఇలో కొత్తగా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కంపెనీలను ఎంపిక చేస్తామని చెబుతున్నారని జగన్ అన్నారు.
సింగపూర్.. సింగపూర్ అని చంద్రబాబు కలవరించారని, కానీ సింగపూర్కు చెందిన ప్రయివేటు కంపెనీలు వచ్చాయన్నారు. స్విస్ ఛాలెంజ్ అంటే వేరే ఎవరూ కోట్ చేయకుండా చేస్తారని విమర్శించారు. సింగపూర్ కంపెనీలకు 99 ఏళ్లకు మూడువేల ఎకరాలను లీజుకు ఇస్తారని విమర్శించారు.