పవన్ కళ్యాణ్ దారిలో.. పేర్లు: జనసేనకు జగన్ కౌంటర్ 'జై ఆంధ్రప్రదేశ్'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లుండి (ఆదివారం) విశాఖలో 'జై ఆంధ్రప్రదేశ్' పేరుతో భారీ సభను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సభా వేదికను ఖరారు చేసింది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ చెప్పడం, భారీ ప్యాకేజీ ఇస్తామని కేంద్రం హామీ ఇవ్వడం, టిడిపి అందుకు అంగీకరించిన నేపథ్యంలో విపక్షాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగా వైసిపి విశాఖలో సభ నిర్వహించనుంది.
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే ఈ సభకు 'జై ఆంధ్రప్రదేశ్' అని నామకరణం చేశారు. సభా ప్రాంగణానికి తెన్నేటి విశ్వం పేరు పెట్టారు. సభా వేదికకు గురజాడ అప్పారావు ప్రజా వేదికగా నామకరణం చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ తదితరులు శుక్రవారం నాడు సభ ఏర్పాట్లను పరిశీలించారు. విజయ సాయి రెడ్డి దగ్గర ఉండి గత రెండు రోజులుగా ఈ సభ ఏర్పాట్లను చూస్తున్నారు.
కాగా, వైయస్ జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దారిలో నడుస్తున్నట్లుగా ఉంది. అనంతపురంలో ఈ నెల 10న పవన్ ప్రత్యేక హోదా కోసం సభను నిర్వహించనున్నారు. సభకు, సభా వేదికకు, పేర్లు పెట్టారు. జగన్ కూడా విశాఖ హోదా సభకు పేర్లు పెట్టారు.
అనంతపురంలో నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ సభకు సీమాంధ్ర హక్కుల చైతన్య వేదిక అని పెట్టారు. సభ జరిగే మైదానం పేరును తరిమెళ నాగిరెడ్డి అని నామకరణం చేసారు. సభావేదికకు కల్లూరి సుబ్బారావు అని పేరు పెట్టారు. ఓ విధంగా పవన్ వరుస సభలకు జగన్ విశాఖ సభ కౌంటర్గా కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications