సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతోంది. అధికార వైసీపీ మేమంతా సిద్దం పేరుతో జనంలోకి వెళ్తోంది. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో సాగుతున్న ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ వైసీపీ అభ్యర్ధుల్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఇవాళ కీలక ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులో సీటు కోల్పోయిన ఓ ఎమ్మెల్యేకు కీలక హామీ ఇచ్చారు.
కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ హఫీజ్ ఖాన్ కు ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్ధానంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ను బరిలోకి దింపుతోంది. ఈ నేపథ్యంలో ఇంతియాజ్ కోసం కర్నూలు సీటు త్యాగం చేసిన హఫీజ్ ఖాన్ కు జగన్ ఇవాళ కీలక హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరు సభలో స్ధానికంగా పోటీ చేస్తున్న అసెంబ్లీ అభ్యర్ధుల్ని జనానికి పరిచయం చేసిన తర్వాత.. హఫీజ్ ఖాన్ ను పిలిచారు.

కర్నూలులో ఇంతియాజ్ కోసం సీటు త్యాగం చేసిన డాక్టర్ హఫీజ్ ఖాన్ ను తిరిగి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లలో ఒకదానికి ఎంపిక చేసి పంపుతామని సీఎం వైఎస్ జగన్ బహిరంగ ప్రకటన చేశారు. దీంతో సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇప్పటికే వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ ప్రత్యామ్నాయాలు చూపించేశారు. ఇదే క్రమంలో హఫీజ్ ఖాన్ కు ఇప్పటికే రాజ్యసభ సీటు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని జగన్ ఇవాళ బహిరంగంగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications