ఆ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే వైఎస్ జగన్ ఎదురుదాడి?
గత ఎన్నికలకు కీలక అంశంగా మారిన కోడికత్తి శ్రీను వ్యవహారం విశాఖపట్నం విమానాశ్రయంలోనే జరిగింది. రానున్న ఎన్నికలకు కూడా కీలకమైన అంశంగా మారిన మంత్రులపై దాడి కూడా విశాఖ విమానాశ్రయంలోనే చోటుచేసుకుంది. అప్పటి సంఘటనలో స్వల్పంగా గాయపడిన వైఎస్ జగన్ ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదంటూ హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు.

టీడీపీకి బీజేపీ దూరం?
విమానాశ్రయంలో తమ మంత్రులపై దాడిచేసింది జనసేన శ్రేణులేనంటూ కేసులు నమోదయ్యాయి. 9 మందికి మినహా మిగతా అందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలియజేసిన చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల్లో సీపీఐ స్పందించింది. సీపీఎం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అంతక్రితమే బీజేపీ ఏపీ ఇన్ ఛార్జి సునీల్ ధియోదర్ కుటుంబ పార్టీ కావడంతో తాము టీడీపీతో పొత్తును ఇష్టపడంలేదని, జనసేన తమతోనే ఉందని ప్రకటించారు.

వైసీపీలో మేథోమధనం
వైసీపీని ఎదుర్కోవడానికి కూటమిని కడుతున్న చంద్రబాబును ఎదుర్కొనే అంశంపై ఆ పార్టీలో మేథోమధనం జరుగుతోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆ పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారు. మొదటి నుంచి తాము చెబుతూనే ఉన్నామని.. అది ఈరోజు నిజమైందని వైసీపీ అంటోంది. తెలుగుదేశం, జనసేన వేర్వేరు కాదని, రెండూ ఎన్నికల్లో కలిసే పోటీచేస్తాయని తమకు ముందే తెలుసంటూ విమర్శలు ప్రారంభించింది.

విపక్షాల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత ఎదురుదాడి
ముందుగా జనసేనపై దాడిని మెదలుపెట్టారు. జగన్ తోపాటు ఇతర నేతలపై దాడిచేస్తూ వారిని ఆత్మరక్షణ ధోరణిలోకి నెడుతూ వారంతా పార్టీకి దూరమయ్యేలా చేస్తే జనసేన బలహీనపడుతుందనే వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. అంతేకాకుండా విపక్షాలన్నీ కలిసి పోటీచేస్తే ఎలా ఉంటుంది? వైసీపీ ఎలా ఎదుర్కోవాలి? అనే విషయమై జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం చేస్తున్న సర్వేలపై కూడా సీఎం దృష్టిపెట్టారు. పార్టీ పటిష్టత, ఎమ్మెల్యేల పనితీరు, ఇన్ ఛార్జిల పరిస్థితి తదితర అంశాలతోపాటు టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తే ఎలా ఉంటుంది? లాంటి వివరాలన్నింటినీ తెప్పించుకొని క్రోడీకరిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు నేతలందరికీ ఆదేశాలు వెళుతున్నాయి. టీడీపీ, జనసేనతో ఏయే పార్టీలు కలుస్తాయనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత వైసీపీ తన ఎదురుదాడిని ఉధృతం చేయాలని నిర్ణయించుకుంది. అప్పటివరకు విపక్ష కూటమిపై విమర్శలకే పరిమితమబోతోంది.












Click it and Unblock the Notifications