జగన్ గుంటూరు టూర్ రూట్- భారీగా బందోబస్త్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో పర్యటన, పోరాటానికి శ్రీకారం చుట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గత జగన్ ప్రభుత్వానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం చోటు చేసుకుంటోన్న ఈ పోరాటం.. ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు బయలుదేరుతారు. మంగళగిరి, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ కార్యాలయం, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మార్గాల మీదుగా సిద్దార్ధనగర్లో ఉన్న అంబటి రాంబాబు నివాసానికి 11 గంటలకు చేరుకుంటారు.

అక్కడ అంబటి కుటుంబ సభ్యులను కలిసి సంఘటనపై ఆరా తీసి వారికి ధైర్యం చెబుతారు. పరామర్శ అనంతరం మధ్యాహ్నం గుజ్జనగుండ్ల, స్తంభాల గరువు, కలెక్టర్ కార్యాలయం, చుట్టుగుంట, కేవీపీ (వీఐపీ) రోడ్, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, కాకాణి, మంగళగిరి మార్గాల మీదుగా తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రే ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరులో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
శుక్రవారం నాడు జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లనున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. అంబటి, జోగి రమేశ్ తో పాటు విడదల రజినీ.. ఇలా వరుసగా వైసీపీ నేతల ఇళ్ల పైన జరిగిన దాడులపై జగన్ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం పర్యటన తర్వాత దీనిపై జగన్ ఈ లేఖ రాస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications