నేతలతో భేటీకి నిర్ణయం: తెలంగాణపై వైయస్ జగన్ దృష్టి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. దీంతో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పార్టీ వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.
సమైక్యంధ్రకు మద్దతు పలుకుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయమ్మ, పలువురు సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆగ్రహానికి గురైనా తెలంగాణ ప్రాంత నేతలు కొండా సురేఖ, కొండా మురళీ, మక్కాన్సింగ్ ఠాకూర్, కెకె మహేందర్ రెడ్డి, పలువురు నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. వారు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందె.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు జగన్ పిలుపునిచ్చారు. గత సోమవారం చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలైన జగన్మోహన్రెడ్డి పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలోని జిల్లా, నియోజక వర్గ పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితిపై చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రాంతంలో
119 శాససన సభ నియోజక వర్గాలుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 50 నియోజక వర్గాలకు కూడా కో-ఆర్డినేటర్లు లేరు. అయితే జగన్ జైలు నుంచి విడుదలైన సందర్భంలో తెలంగాణలోని నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, మరికొన్ని జిల్లాల్లో కొందరు జగన్ అభిమానులు సంబరాలు చేసుకోవడం పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్, రంగారెడ్డితోపాటు మరికొన్ని జిల్లాల నుంచి పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు ఇక్కడి నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ ముఖ్యనేతలను జగన్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనతో వచ్చే నష్టాలను ఇక్కడి నేతలకు వివరించనున్నట్లు సమాచారం.
ఈ సమావేశంలో ఏ పరిస్థితుల్లో తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ తెలంగాణ ప్రాంతంలో 25 శాసన సభ స్థానాలను గెలిచినట్లయితే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications