YSRCP శాశ్వత అధ్యక్ష వివాదంలో మరో ట్విస్ట్-పదవి వద్దన్న జగన్-బయటపెట్టిన సజ్జల-ఐదేళ్లకే..
వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్ష పదవిపై నెలకొన్న వివాదం ఇవాళ మరో మలుపు తిరిగింది. గతంలో పార్టీ ప్లీనరీ సమావేశాల్లో వైఎస్ జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. దీనిపై ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇప్పుడు ఈసీ అభ్యంతరాల నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో పార్టీ కీలక నేత సజ్జల బయటపెట్టారు. జగన్ శాశ్వత అధ్యక్ష పదవిని తిరస్కరించినట్లు ఆయన వెల్లడించారు.
వైఎస్ జగన్ శాశ్వత అధ్యక్ష పదవి
వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ను నియమిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ఏడాది జూలైలో జరిగిన పార్టీ ప్లీనరీలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ కు పోటీగా మరొకరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నికైనట్లు అప్పట్లో ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. అయితే వైసీపీ మాత్రం దీనిపై స్పందించలేదు. ఆ తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేయడంతో ఈసీ దీనిపై స్పందించి నోటీసులు పంపింది.
ఈసీ నోటీసులపై సజ్జల స్పందన
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ నియామకంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ సీఈసీ తాజాగా నోటీసులు జారీ చేసింది. రాజకీయ పార్టీలకు శాశ్వత అధ్యక్షులు ఉండరని, ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుల్ని ఎన్నుకోవాల్సిందేనని తెలిపింది. అంతే కాదు వైసీపీలో అంతర్గతంగా దీనిపై విచారణ జరిపి ఈసీ నిబంధనల ప్రకారం అధ్యక్ష ఎన్నిక జరగకపోవడంపై నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించింది. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ పెద్దలు దీనిపై దృష్టిసారించారు. ఎట్టకేలకు ఈసీకి వివరణ పంపారు. దీనిపై పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
శాశ్వత అధ్యక్ష పదవి వద్దన్న జగన్
వైసీపీ ప్లీనరీలో వైఎస్ జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే తనకు శాశ్వత అధ్యక్ష పదవి వద్దని జగన్ తిరస్కరించినట్లు పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ వెల్లడించారు. అదే విషయం అప్పట్లో ఎందుకు చెప్పలేదన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధ్యక్ష పదవికి జగన్ తప్ప మరో నేత పోటీ పడే అవకాశం లేదు. అలాంటప్పుడు శాశ్వత అధ్యక్ష పదవికి కూడా జగన్ మినహా మరో అభ్యర్ది లేరు. అప్పుడు జగన్ నిబంధనల ప్రకారం ఇది తప్పని తిరస్కరించాల్సి ఉంటుంది. అదే జరిగితే వైసీపీ నేతలు అప్పుడే దాన్ని బయటపెట్టి ఉండేవారు. కానీ ఇప్పుడు ఈసీ అడిగాక సజ్జల ఇచ్చిన వివరణపై చర్చ జరుగుతోంది.
జగన్ అధ్యక్ష పదవి ఐదేళ్లే..
వైసీపీ ప్లీనరీలో జగన్ వైసీపీ శాశ్వత అధ్యక్ష పదవి తిరస్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఐదేళ్ల వరకే జగన్ అధ్యక్షుడిగా ఉంటారని సజ్జల ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఇదే విషయాన్ని ఈసీకి కూడా సమాచారం ఇచ్చినట్లు సజ్జల పేర్కొన్నారు. అప్పట్లో జగన్ శాశ్వత అధ్యక్ష పదవిని తిరస్కరించడం వల్ల ఈ విషయం మినిట్స్ లోకి ఎక్కలేదని, అదే విషయం ఇప్పుడు తాము ఈసీకి నివేదించినట్లు సజ్జల ప్రకటించారు. దీంతో ఈ వివాదం ఇక్కడితో సద్దుమణినట్లయింది. వైసీపీ వివరణపై ఈసీ ఏమంటుందో చూడాలి మరి.