వైసీపీ సర్కార్ కు కొండపల్లిలో చిక్కిన ఉమ-పోలవరం, పట్టిసీమలో కుదరక-కక్షసాధింపేనా ?
టీడీపీలో చంద్రబాబు, లోకేష్ తర్వాత వైసీపీ మండిపడే నేతల్లో మాజీ మంత్రి దేవినేని ఉమ ముందు వరుసలో ఉంటారు. గతంలో వైసీపీ విపక్షంలో ఉండగా చంద్రబాబు ప్రభుత్వంలో జలవనరులశాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమను పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అవినీతి పేరుతో వైసీపీ టార్గెట్ చేసేది. దీనికి కౌంటర్ గా ఉమ ఎప్పుడూ వైఎస్ జగన్ పై నమోదైన సీబీఐ అక్రమాస్తుల కేసును తెరపైకి తెచ్చేవారు. దీంతో ఉమను వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా సైతం ట్రోల్ చేసేవి. వైసీపీ అధికారంలోకి రాగానే ఉమను ఏదో కేసులో ఇరికించడం ఖాయమనే ప్రచారం సాగింది. రెండేళ్ల తర్వాత అదే నిజమైంది.
జగన్, దేవినేని ఉమ వైరం
వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ సర్కార్ లో టార్గెట్ చేసే నేతల్లో దేవినేని ఉమ ముందు వరుసలో ఉండేవారు. ముఖ్యంగా జగన్ ను ఏకవచనంతో సంభోదిస్తూ జగన్మోహన్ రెడ్డీ అంటూ అసెంబ్లీలో దేవినేని ఉమ చేసే విమర్శలు మీడియాలో హెడ్ లైన్స్ లో కనిపించేవి. అప్పటి నుంచే జగన్ తో పాటు వైసీపీ నేతలకు దేవినేని ఉమ అంటేనే కంటగింపుగా ఉండేది. ఉమను విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వైసీపీ వదులుకునేది కాదు. ఆ వైరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే రూటు మారిందంతే.
పోలవరం, పట్టిసీమపై ఉమ టార్గెట్
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఏపీ విభజన పూర్తయి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. విభజన హామీల్లో భాగంగా కేంద్రం చేతుల్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు ఎలాగోలా తన చేతుల్లోకి తెచ్చుకున్నారు తనకు నచ్చిన కాంట్రాక్టర్లను సైతం నియమించుకున్నారు. ప్రతీ సోమవారం పోలవరం పర్యటన పేరుతో చంద్రబాబు నానా హంగామా చేసే వారు.
ఆయన వెంట జలవనరుల మంత్రి హోదాలో దేవినేని ఉమ కనిపించేవారు. ఇలా చంద్రబాబు, ఉమ పోలవరం వెళ్లినప్పుడ్లలా వైసీపీ నేతలు టీడీపీ అవినీతిపై విమర్శలు చేసేవారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ఆలస్యమవుతోంది కాబట్టి పట్టిసీమ తెస్తున్నామంటూ 13 నెలల్లోనే ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేసింది చంద్రబాబు సర్కార్. ఇలా వేగంగా లిఫ్ట్ పూర్తి చేసినందుకు కాంట్రాక్టర్ కు వందల కోట్లు గిఫ్డ్ గా కూడా ఇచ్చేసింది. దీనిపైనా వైసీపీ అధినేత జగన్ తరచుగా విమర్శలు చేసేవారు.
సీబీఐ కేసులతో జగన్ టార్గెట్
పోలవరం, పట్టిసీమపై వైసీపీ నేతలు ఎప్పుడు విమర్శలు చేసినా దానికి కౌంటర్ గా కొద్ది గంటల్లోనే ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ మంత్రి దేవినేని ఉమ కౌంటర్లు ఇచ్చేవారు. ఇందులోనూ ప్రధానంగా సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల్లో జగన్ జైలు కెళ్లడం ఖాయమని చెప్పేవారు. తన తండ్రి వైఎస్ హయాంలో జరిగిన అవినీతి, క్విడ్ ప్రోకో కేసుల్ని పదే పదే ప్రస్తావించేవారు. దీంతో దేవినేని ఉమకు కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ వద్ద అస్త్రాలు కరువయ్యేవి. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఇదే తంతు సాగింది. దీంతో దేవినేని ఉమ వైసీపీకి ఆగర్భ శత్రువుగా మిగిలిపోయారు.
పోలవరం, పట్టిసీమలో దొరకని ఉమ
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిపోతోందంటూ తాము విపక్షంలో ఉండగా టీడీపీ మంత్రి అయిన దేవినేని ఉమను టార్గెట్ చేసిన వైసీపీ.. తాము అధికారంలోకి వచ్చీరాగానే వాటిపై సీరియస్ గా దృష్టిపెట్టింది. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన వెంటనే మిగతా మంత్రులతో పాటు దేవినేని ఉమపై ఉన్న ఆరోపణలపై మంత్రివర్గ కమిటీతో పాటు జలవనరులశాఖ అధికారులతో వైసీపీ సర్కార్ దర్యాప్తులు చేయించింది. అయినా పోలవరం, పట్టిసీమలో అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయింది. దీంతో అమరావతి తరహాలోనే పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై వచ్చిన ఆరోపణలు కూడా ఆధారాల్లేకుండా తేలిపోయాయి.
కొండపల్లిలో దొరికిన దేవినేని
పోలవరం, పట్టిసీమలో దేవినేని ఉమ అవినీతిని నిరూపించలేకపోయిన వైసీపీ సర్కార్ అదను కోసం వేచి చూస్తోంది. సరిగ్గా అదే సమయంలో సీఎం జగన్ పై ఆయన ప్రెస్ మీట్లో చేసిన విమర్శలపై కేసులు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. హైకోర్టు జోక్యంతో ఆ వివాదం ముందుకు సాగలేదు. చివరికి తాజాగా కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ లో అక్రమ గ్రావెల్ తవ్వకాలను కనిపెట్టేందుకు దేవినేని ఉమ వెళ్లడంతో అక్కడ ఆయన్ను టార్గెట్ చేసింది. విజయవాడలోనో, గుంటూరులోనో టార్గెట్ చేస్తే జనం కళ్లలో పడతారు. అందుకే తెలివిగా కొండపల్లి అడవుల్లో ఆయన కారులో వెళ్తుండగా అడ్డుకుని హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేసింది. వీటిని నిరూపించడం కష్టమే అయినా పకడ్బందీగా ఉమపై దాదాపు 20 కేసులు పెట్టినట్లు తెలుస్తోంది.
Recommended Video
సర్కార్ ఉచ్చులో ఇరుక్కున్నారా ?
పోలవరం. పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం సమయంలోనే దేవినేని ఉమను వైసీపీ ఏ విధంగా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చాక దేవినేని ఉమ అవినీతిని నిరూపించేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. అయినా ఆయన ఎక్కడా దొరక్కపోవడంతో చివరికి ఆయన్ను కొండపల్లి అటవీ ప్రాంతంలో ప్రభుత్వం టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే మైనింగ్ ప్రాంతాల్లోకి టీడీపీ నేతల్ని ప్రభుత్వం అనుమతించడం లేదని తెలిసి అక్కడికి వెళ్లిన దేవినేని ఉమ ప్రభుత్వం వేసిన ఉచ్చులో ఇరుక్కున్నట్లు అర్ధమవుతోంది. దీంతో అడవిలో ఏం జరిగిందనే అంశంపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టడం టీడీపీకి కష్టంగా మారింది.