ఏపీకి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పెట్టిన కేంద్రం?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని జగన్ ఆరోపించారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వెల్లడించారు. చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని జగన్ పేర్కొన్నారు . కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయని చెప్పారు.
తాజా కాగ్ నివేదికలను ఉదహరిస్తూ వైయస్ జగన్ ఎక్స్ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓ పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా 3,354 కోట్ల రూపాయలుగా ఉన్నట్లుగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రకటన చేసింది గానీ..అది అబద్దమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించిందని అన్నారు.
2024 ఏప్రిల్తో పోల్చితే 2025 ఏప్రిల్లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గిందని జగన్ వివరించారు. ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని విమర్శించారు.
సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన 796 కోట్ల రూపాయలు తగ్గిందనీ, అందువలన జీఎస్టీ ఆదాయాలు సైతం తగ్గాయని కాగ్ నివేదికప్రకటించినట్లు జగన్ వివరించారు. నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతనే నికర జీఎస్టీని లెక్కగడతారని, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలను చేస్తోందని చెప్పారు.
టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయని, దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందనేది తేలిపోయిందని జగన్ అన్నారు. గత ఏడాదితో పోల్చితే పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయని గుర్తు చేశారు.
పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయని, ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశమని వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లను ఇందులో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications