చంపేస్తున్నారు: బాబుపై జగన్ తీవ్రంగా, నేత అరెస్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు గవర్నర్ నరసింహన్ను కలిసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఏపీలో దిగజారుతున్న శాంతిభద్రతల పైన గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వైసీపీ నేతల పైన జరుగుతున్న దాడులు, హత్యల పైన సీబీఐతో విచారణ జరిపించాలని తాము గవర్నర్ను కోరామని చెప్పారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీతో కలిసి వైసీపీ నేతలను హత్యలు చేయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
తమ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా నేత ప్రసాద్ రెడ్డి హత్య, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అరెస్టు అంశాలను తాము గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే వారు హత్యలో భాగస్వాములు అవుతున్నారన్నారు. డీజీపీ అనంతపురం వస్తే మంత్రి ఇంట్లో టిఫిన్ చేస్తారని విమర్శించారు. గవర్నర్ను కలిసిన వారిలో జగన్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు.
ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్
తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ వైసీపీ సోమవారం అనంతపురంలో బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు సూచన మేరకే తమ పార్టీ నేతలను హత్య చేస్తున్నారని, అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ నేతల పైన ఉన్న కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.