లాగి కొట్టమని చెప్పా కదా: డిగ్గీపై జగన్, బిజెపి పొత్తుపై..
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సమైక్యాంధ్రకు మద్దతిస్తే ఆ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన మరోసారి తీవ్రంగా స్పందించారు.
గురువారం సాయంత్రం జగన్ తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్డీయేకు మద్దతివ్వడంలో తప్పేముంటుందని ఒక మేగజైన్తో చెప్పారు కదా అని విలేకరులు ప్రశ్నించారు. దానికి జగన్... మా స్టాండ్ స్పష్టంగా చెప్పామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారిని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు మద్దతిస్తామన్నారు. గతంలోనే ఇది చెప్పామన్నారు.

ఒకవేళ బిజెపి సమైక్యాంధ్ర కోసం పని చేస్తే పని చేస్తారా? అని అడగ్గా... తాను అందుకే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ను కలిసి గట్టిగా చెప్పానని వివరించారు.
బిజెపి, తెలుగుదేశం పార్టీలు కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయనగా... వారు స్నేహం చేస్తున్నారా? లేదా? అనేది కాదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుండబెడతామన్నారు.
తనది కాంగ్రెసు డిఎన్ఎ అన్న ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన మరోసారి ఘాటుగా స్పందించారు. తాను ఇదివరకే చెప్పానని, మీరు ఆయనను లాగి కొడితే అలా మాట్లాడటం మానేస్తారన్నారు. విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన జగన్ మండిపడ్డ విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications