అప్పుడు వంగవీటి రంగాను చంపించావు, ఇప్పుడు తునిలో అలజడి: చంద్రబాబుపై జగన్
హైదరాబాద్: ప్రతి వర్గాన్నీ, కులాన్నీ, ప్రాంతాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్రిమినల్ నెంబర్ వన్ ఎందుకు అనకూడదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. లంచాలు తీసుకుని పట్టి సీమను నిర్మించి, దానివల్ల లాభం ఉండదంటే తమ పార్టీ మీద చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో ఆడవాళ్ల చేతులతో చెలగాటమాడుతావా అని అడిగితే తమ పార్టీ విజయవాడకు వ్యతిరేకమని అంటారని చెప్పారు. కాపుల ఐక్య గర్జనకు పెద్ద యెత్తున కదిలారని, కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశావని ప్రశ్నిస్తే ఇతరుల మీద అబాండాలు వేశారని ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు.
కాపు సభకు బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా వెళ్లారని, ఆయన పేరు చెప్పలేదని జగన్ అన్నారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే 22 నెలల తర్వాత కాపులు సభ పెట్టుకున్నారని ఆయన చెప్పారు. కాపు ఐక్య గర్జనను అడ్డుకోవడానికి ప్రయత్నించి, వారి నిస్పృహతో చంద్రబాబు ఆడుకున్నారని ఆయన అన్నారు.
సభ ఉద్యమకారులకు, ప్రతిపక్ష పార్టీలకు మంచి పేరు వస్తుందని, ఆ మంచి పేరు రాకూడదని ... చెడ్డ పేరు రావాలని అలజడి చంద్రబాబు సృష్టించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ఆయన అడిగారు.
వంగవీట రంగాను చంపించావు, క్రిమినల్ బుర్ర
1988 మేలో కాపునాడు సభ విజయం సాధిస్తే సహించలేక వంగవీటి రంగాను చంద్రబాబు హత్య చేయించారని, చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన మంత్రి ఆ విషయం పుస్తకంలో రాశారని ఆయన అన్నారు. ముద్దాయిల్లో ఒకరు దేవినేని ఉమ మంత్రిగా, మరొకరు కోడెల స్పీకర్గా ఉన్నారని, మరొకరు రామరకృష్ణ టిడిపిలో ఉన్నారని ఆయన అన్నారు. చంద్రబాబుది క్రిమినల్ క్రిమినల్ బుర్ర అని ఆయన అన్నారు.
బీసీలు ఎందుకు అంగీకరించరని, బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారని, అలా చేస్తే కాదంటారా అని అన్నారు. టిడిపి ఎమ్మెల్యే కృష్ణయ్య చేత కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడించారని, మాలలూ మాదిగల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబేనని ఆయన అన్నారు.
మాటి మాటికీ అబద్ధాలు చెప్తాడని ఆయన చంద్రబాబుపై అన్నారు. ఆరు చానెళ్లకు మాత్రమే ఎందుకు తెలిసిందని చంద్రబాబు అనడాన్ని గుర్తు చేస్తూ వాటిని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ప్రతి చానెల్లో తుని సంఘటనలు ప్రసారమయ్యాయని ఆయన అన్నారు. మోసం, వెన్నుపోట్లు, అన్ని వర్గాల మధ్య చిచ్చు చంద్రబాబు చరిత్ర అని ఆయన అన్నారు.
చంద్రబాబు ఆదివారం నాడు మాట్లాడింది ఆత్మస్తుతి, పరనింద అని ఆయన అన్నారు. ఒక్క ముఖ్యమంత్రి ఇంతగా దిగజారుతారా అని అయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నిందలు వేస్తున్నారని ఆయన చంద్రబాబును దుయ్యబట్టారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వేటినీ చంద్రబాబు అమలు చేయలేదని, అందుకు చంద్రబాబును క్రిమినల్ నెంబర్ వన్ ఎందుకు అనకూడదని ఆయన అన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై, బోయలను ఎస్టీల్లో చేరుస్తానని ఇచ్చిన హామీపై చంద్రబాబు మోసం చేశారని ఆయన అన్నారు.
తమిళనాడులో రిజర్వేషన్లు యాభైకి పైగా ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేకపోతున్నారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, చంద్రబాబుకు అనుకూలమైన ప్రభుత్వమే కేంద్రంలో ఉందని, అందువల్ల తీర్మానం చేసి, పంపి రాజ్యాంగ సవరణ చేయిస్తే బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించవచ్చునని అంటూ చంద్రబాబు ఎందుకు చేయడం లేదని అడిగారు.
కమిషన్ వల్ల ఫలితం లేదని, 9వ షెడ్యూల్లో చేర్పింపి రాజ్యాంగ సవరణ చేయించి కమిషన్ ఏర్పాటు చేస్తే ఆచరణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఇంతకు ముందు బీసీలుగా ఉన్నారని గుర్తు చేస్తూ ఎందుకు కాపులకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలో కమిషన్కు మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
మురళీమోహన్, సుజనా భూములను వదిలేస్తారు...
ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదేసే ధైర్యం చంద్రబాబుకు లేదని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తూ కులాల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. అన్ని వర్గాల్లో నిస్పృహ చోటు చేసుకుందని, ఆ నిస్పృహ కారణంగానే తుని కాపు సభలో ప్రతిఫలించిందని ఆయన అన్నారు.
రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దంటే వైసిపి రాజధానికి వ్యతిరేకమని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు చెందిన బినామీలు మురళీమోహన్, సుజనా చౌదరి, నారాయణ భూములను మాత్రం వదిలేసి, రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని, అసైన్డ్ భూములను కూడా తీసుకుని క్రమబద్దీకరించుకునే పనికి చంద్రబాబు ఒడిగట్టారని ఆయన అన్నారు.
ఉద్యోగులకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అనడంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అమరావతిలో ఓలింపిక్స్ జరుపుతానని చంద్రబాబు అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. చైనా ఒలింపిక్స్ నిర్వహణకు 42.5 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆయన అన్నారు. సింగపూర్ వెళ్లి అమరావతిని సింగపూర్ చేస్తానంటాడు, చైనా వెళ్లి బీజింగ్ చేస్తానంటాడని ఆయన ఎద్దేవా చేశారు.